కరోనాలో హీటెక్కిన మాన్సాస్ రాజకీయాలు- మరోసారి తెరపైకి సంచైత....
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్నా ఏపీలో మాత్రం రాజకీయ వేడి కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకూ వైసీపీ నేతలు విచ్చలవిడిగా ప్రజల్లోకి వచ్చి కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న విమర్శలు కొనసాగుతుండగా.. తాజాగా కరోనా ప్రభావం లేని విజయనగరం జిల్లాలో మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ హోదాలో సంచైత గజపతిరాజు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు కాక రేపుతున్నాయి.
మళ్లీ తెరపైకి సంచైత గజపతిరాజు...
నెలన్నర రోజుల క్రితం వివాదాస్పద రీతిలో విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ బాధ్యతలను అనూహ్య రీతిలో చేపట్టిన సంచైత గజపతిరాజు.. ఆ తర్వాత తనదైన శైలిలో పని మొదలుపెట్టారు. మాన్సాస్ ఛైర్ పర్సన్ హోదాలో తూర్పుగోదావరి జిల్లాలోని భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చిన సంచైత తొలి నిర్ణయంతోనే వివాదం రేపారు. దీనిపై స్ధానికంగా రైతులు అభ్యంతరం తెలపడం ఆ తర్వాత పోలీసులు, రెవెన్యూ అధికారుల సాయంతో తవ్వకాలు కొనసాగించడం చకచకా జరిగిపోయాయి. అయితే కరోనా ప్రభావం ప్రారంభమైన తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గానే కనిపించిన సంచైత.. తిరిగి మాన్సాస్ వ్యవహారాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు.
తెరపైకి సంచైత సెక్రటరీ వివాదం-
మాన్సాస్ వ్యవహారాలపై పట్టు సాధించేందుకు చెన్నైకు చెందిన మోహన్ కుమార్ ను తన వ్యక్తిగత కార్యదర్శిగా సంచైత నియమించుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా ఆయన కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో చెన్నై నుంచి మాన్సాస్ ట్రస్టు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టడం వివాదాస్పదమైంది. లాక్ డౌన్ సమయంలోనూ మోహన్ కుమార్ ఎంచక్కా నిబంధనలు ఉల్లంఘించి కరోనా ప్రభావం లేని గ్రీన్ జోన్ ప్రాంతం విజయనగరం రావడం వెనుక సంచైత స్కెచ్ ఉందనే ప్రచారం జరిగింది. అయితే తన కార్యదర్శి ఏప్రిల్ 16 నుంచి విజయనగరంలోనే ఉన్నారని ఆమె వివరణ ఇచ్చారు. అయితే ఆయన్ను క్వారంటైన్ కు పంపాలన్న డిమాండ్లు ఎక్కువ కావడంతో చివరికి ట్రస్టు గెస్ట్ హౌస్ లోనే హోం క్వారంటైన్ లో ఉంచారు. క్వారంటైన్ కేంద్రానికి పంపకుండా అక్కడ ఉంచడం కూడా మరో వివాదానికి దారి తీసింది.
సింహాచలం ఆలయ వివాదం...
తాజాగా సింహాచలంలోని వరాహలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చందనోత్సవం జరిగింది. ఈ సమయంలో లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నందున మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ హోదాలో ఉన్న సంచైత, ప్రధాన అర్చకుడితో పాటు కేవలం 30 మందిని మాత్రమే అనుమతించారు. కానీ ఆలయంలో ఉండే వారితో సన్నిహిత సంబంధాలు కలిగిన తిరుపతి శ్రీను అనే వ్యక్తి ఏకంగా అంతరాలయంలోకి వెళ్లి ఏకాంత దర్శనం చేసుకోవడం కలకలం రేపింది. తొలుత ఈ వివాదంపై నోరు మెదపని సంచైత... అనంతరం ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణమాచార్యులను దీనికి బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసింది. కానీ తన సస్పెన్షన్ వెనుక పెద్ద కుట్రే ఉందంటూ ఇప్పుడు ఆయన చేస్తున్న ఆరోపణలతో ఆలయ ఛైర్మన్ సంచైత ఇరుకున పడుతున్నారు.
Recommended Video
మాన్సాస్ పై పట్టు కోసం నిర్ణయాలు..
చారిత్రక మాన్సాస్ ట్రస్టుపై గతంలో ఆనంద్, అశోక్ సోదరులు సాగించిన ఆధిపత్యాన్ని కొనసాగించడం ప్రస్తుత పరిస్ధితుల్లో అంత సులువు కాదు. ఛైర్ పర్సన్ గా సంచైత నియామకంపై హైకోర్టులో కేసు ఇంకా తేలలేదు. ఇలాంటి సమయంలో సంచైత మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. కానీ వ్యక్తిగత కార్యదర్సిని లాక్ డౌన్ సమయంలో హడావిడిగా రప్పించడం, సింహాచలం ఆలయంలోకి అపరిచితులను పంపడం వంటివి నిబంధనల ఉల్లంఘనే అనే విమర్శలు వెల్లువెత్తాయి. వీటిపై చివరి నిమిషంలో స్పందించి పావులు కదిపిన సంచైతకు రాబోయే రోజులు మరిన్ని సవాళ్లు విసరబోతున్నట్లు తెలుస్తోంది.