టీడీపీలో సీట్ల కుంపటి .. సీటు కోసం ఎస్వీ వర్సెస్ టీజీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సీటు కోసం నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు వరించనుండటంతో తమ అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు.
బాబు వద్దకు కర్నూలు సీట్ల పంచాయతీ
కర్నూలు అసెంబ్లీ సీటుపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక్కడినుంచి ప్రస్తుతం ఎస్వీ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్లీ తనకే టికెట్ కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరుతున్నారు. ఈ విషయం మాట్లాడేందుకు గురువారం చంద్రబాబు నివాసానికి వచ్చారు మోహన్ రెడ్డి. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన .. తర్వాత టీడీపీలో చేరారు. ఈ సీటు కోసం టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ పోటీపడుతున్నారు. కొడుకు టికెట్ కోసం టీజీ వెంకటేష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధినేత చంద్రబాబుతో సమావేశమై .. చర్చిస్తోన్నారు.
తెరపైకి లోకేశ్ పేరు
కర్నూలు టికెట్ కోసం వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. టికెట్ కోసం వీరు ప్రయత్నిస్తూనే తెరపైకి లోకేశ్ పేరు తీసుకొచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కర్నూలు నుంచి లోకేశ్ పోటీ చేస్తానంటే స్వాగతిస్తానని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. ఆ తర్వాత రియాక్టైన టీజీ వెంకటేశ్ కూడా లోకేశ్ పోటీ చేస్తే తాము కూడా సపోర్ట్ చేస్తామని ప్రకటించారు. ఇటీవల ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేసిన లోకేశ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయన ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. మోహన్ రెడ్డి, టీజీ మధ్య నెలకొన్న సీటు రగడ నేపథ్యంలోనే తెరపైకి లోకేశ్ పేరు తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది.
కర్నూలు టు చిత్తూరు
సీట్ల పంచాయతీ కర్నూలు నుంచి చిత్తూరుకు మారింది. శ్రీకాళహస్తి నుంచి ఇకపై పోటీ చేయనని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ఈ మేరకు గురువారం అమరావతిలో చంద్రబాబును కలిసి తాను బరిలోకి దిగనని చెప్పారు. అనారోగ్య కారణాల వల్లే పోటీ చేయడం లేదని .. తన కుమారుడు సుధీర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఈసారి కూడా మీరే బరిలోకి దిగితే బాగుంటుందని బొజ్జలతో చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. గోపాలకృష్ణారెడ్డి బరిలోకి దిగకుంటే సీటు కోసం పోటీ ఏర్పడే అావకాశం ఉంది. సుధీర్ రెడ్డి కోసం బొజ్జల ప్రయత్నాలు చేస్తుంటే .. తాను రేసులో ఉన్నానని సంకేతాలు ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు. సుధీర్ కన్నా తనకే విజయవకాశాలు ఉన్నాయని అంశాన్ని గుర్తుచేస్తున్నారాయన.