భగ్గుమన్న బెజవాడ..! అసంతృప్తిలో రాధా..! జనసేన వైపు వంగవీటి వారసుడు..!!
హైదరాబాద్:సంచలన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బెజవాడ. బెజవాడ రాజకీమాలు ఎప్పుడూ వాడి వేడిగా ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో రాజకీయ వాతావరణం మరింత ఉగ్రరూపం దాల్చింది. తాజాగా విజయవాడ వైసీపీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వంగవీటి రాధా ఆశలపై అధిష్ఠానం నీళ్లు చల్లింది. మల్లాది విష్ణుకు సెంట్రల్ పగ్గాలు అప్పగించేందుకు అధిష్ఠానం సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో రాధా సంచలన నిర్ణయం తీసుకున్నాడట. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం రాబోవు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తీసుకునే నిర్ణయాలు అసమ్మతికి కారణం అవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
వైసీపిలో టిక్కెట్ల ఇక్కట్లు షురూ..! అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్న వంగవీటి రాధా..!
ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలో టిక్కెట్ల ఇక్కట్లు ప్రారంభం అయ్యాయి. పలు జిల్లాల్లో ఇప్పటి నుంచే పంచాయతీల పరంపరలు మొదలయ్యాయి. సీట్ల సర్దుబాటు వైసీపీ అధినేత జగన్ కు కూడా పెద్ద తలనొప్పిగా పరిణమించింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఈ తలనొప్పి ఎక్కువగా ఉందని తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ను మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని యోచిస్తుంటే, ఆయన అందుకు ససేమిరా అంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి, వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి కావాలన్నది రాధా ఆశయంగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
వేడెక్కిన విజయవాడ..! వైసీపీలో విభేదాలు మొదలు..!
రాజకీయ, సామాజికపరంగా రంగా తనయుడికి వైసీపీ అధికారంలోకి వస్తే తనకు కేబినెట్ లో ఛాన్స్ దక్కతుందని ఆయన ఆశిస్తున్నారు. అందుకు భిన్నంగా ఎంపీ సీటుకు ఆయన పేరు ప్రతిపాదించటంతో రాధాతో ఆయన అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాధాతో పాటు ఆయన అనుచరులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు.కాని వైసీపి అదిష్టానం మాత్రం విజయవాడ సెంట్రల్ సీటును మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న రాధాతో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు మరికొంత మంది నేతలు చర్చలు జరిపారు.
విజయవాడ సెంట్రల్ టిక్కెట్..! మల్లాది విష్ణు వర్సెస్ రాధా..!
మొన్నామధ్య గుంటూరు జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన రజనిని సమన్వయకర్తగా నియమించడం.. ఇటీవల అదే పార్టీ నుంచి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి బాధ్యతలు అప్పగించడం వంటి నిర్ణయాలతో ఆ పార్టీలోని సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్న వారిని కాదని వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి జగన్.. ప్రాధాన్యత ఇస్తుండడం వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లాది విష్ణు చేరికతో తమకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఇన్నాళ్లూ గుర్రుగా ఉన్న వంగవీటి రాధా వర్గం ఆదివారం జరిగిన ఎపిసోడ్తో తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది.
పార్లమెంట్ వద్దు..! విజయవాడ సెంట్రలే ముద్దు అంటున్న రాధా..!
సెంట్రల్ పగ్గాలు మల్లాది చేతికి అప్పగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఇన్నాళ్లూ ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. బందరు పార్లమెంటు నియోజకవర్గంపై దృష్టి సారించాలని రాధాకు అధిష్ఠానం సూచించినప్పటికీ ఆయన ఆ ప్రతిపాదన పట్ల సంతృప్తిగా లేరు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ, ఆయన సోదరుడు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ రాజీనామా చేశారు. ఇప్పుడు రాధా కూడా ఆయన బాటలోనే నడవబోతున్నారని సమాచారం. ఎప్పటి నుంచో ఆయన అనుచరులు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరాలని కోరుతున్నా ఎటూ తేల్చని రాధా, తాజా వ్యవహారంతో వైసీపీకి గుడ్బై చెప్పి జనసేన కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారని చర్చ జరుగుతోంది. సెంట్రల్ టికెట్ హామీ ఇస్తేనే జనసేనలో చేరాలనే ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ ముందుంచాల రాధా భావిస్తున్నట్టు తెలుస్తోంది.