అనంతపురంలో వేడెక్కిన రాజకీయాలు, టీడీపీ ఎంపీ జేసీ వర్సెస్ ఎమ్మెల్యే... రచ్చరచ్చ!
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య అగ్గి రాజుకుంటోంది. మూడేళ్లుగా విబేధాలతో పలు సార్లు రచ్చకు ఎక్కిన వీళ్లు.. ఇప్పుడు మరోసారి తలపడుతున్నారు.
అనంతపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య అగ్గి రాజుకుంటోంది. మూడేళ్లుగా విబేధాలతో పలుమార్లు రచ్చకెక్కిన వీళ్లు.. ఇప్పుడు మరోసారి పరస్పరం తలపడుతున్నారు.
పార్టీలో తనకు విలువ లేకుండా పోయిందని, తను చెప్పిందేమీ జరగడం లేదని, అభివృద్ధి పనుల విషయంలో కూడా తనకెలాంటి సమాచారం, సహకారం లేదని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. అంతేకాదు.. తను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయన చెబుతుండటం విశేషం. ఈ మేరకు అనంతపురం టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తను ఎంపీ పదవికి రాజీనామా సమర్పిస్తానని, లోక్ సభ స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని అందిస్తానని ఆయన అంటున్నారని దివాకర్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. తన నియోజకవర్గాన్నిఅభివృద్ధి చేయలేనందుకు చింతిస్తూ, అందుకు సహకారం అందకపోవడంతో రాజీనామా చేస్తానని ఆయన అంటున్నారట.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ఇది వరకే ప్రకటించిన దివాకర్ రెడ్డి ఇప్పుడు రాజీనామా అంటుండటం ఆసక్తికరంగా మారింది. అయితే దివాకర్ రెడ్డి మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఆయన అనుచరుల వద్ద మాత్రమే అలా వాపోతున్నారని అధికారికంగా ప్రకటించ లేదు కదా.. అనే వాదన వినిపిస్తున్నారు వాళ్లు.
ఇక అనంతపురం వేదికగా... దివాకర్ రెడ్డి వర్గం, ప్రభాకర్ చౌదరి వర్గం తాజాగా మరోసారి తలపడింది. అనంతపురం కార్పొరేటర్లలో కొందరు జేసీ వర్గంలో ఉండగా, మరికొందరు చౌదరి వర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి వర్గంలోని ఒక కార్పొరేటర్, దివాకర్ రెడ్డి వర్గంలోని మరో కార్పొరేటర్ బాహాబాహీకి కూడా దిగారు. కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో కార్పొరేటర్లు పరస్పరం దాడి చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
పార్టీ నుంచి తనకు సహకారం అందడం లేదని జేసీ పదే పదే వ్యాఖ్యానిస్తూ ఉండటం, మరోవైపు ప్రభాకర్ చౌదరి వర్గంతో జేసీ వర్గం ముఖాముఖీ పోరు.. మొత్తానికి అనంతపురం రాజకీయాల్లో ఈ పరిణామాలు రసవత్తరంగా మారాయి.