కీలకంగా మారిన ముస్లిం ఓట్లు...పావులా వాడుకుంటున్న రాజకీయ పార్టీలు:ముస్లిం సంక్షేమ సమితి
గుంటూరు:ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లిం ఓట్లు కీలకంగా మారాయని...అందుకే రాజకీయ పార్టీలు వారిని పావుగా వాడుకుంటున్నాయని ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముక్తార్ అలీ అభిప్రాయపడ్డారు.
గుంటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఏ పార్టీ వారు పాటుపడినా ఆ పార్టీ వారి రుణం తీర్చుకోటానికి ముస్లిం మైనార్టీలు ముందంజలో ఉంటారని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి ముస్లిం మైనార్టీలకు మేలు చేశారని అన్నారు. 2014 ఎన్నికలలో ఆయన రుణం తీర్చుకోవటం కోసం ముస్లిం మైనారిటీలు డెబ్బై ఐదు శాతం ఓట్లు వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి వేయటం జరిగిందన్నారు.
అలాగే గుంటూరులో నిర్వహించిన "నారా హమారా...టిడిపి హమారా" సభలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన వరాల జల్లు చాలా సంతోషకరమైందని అన్నారు. సిఎం ముస్లింలపై ప్రకటించిన వరాల జల్లు అమలు చేసినట్లయితే 2019 ఎన్నికలలో మిలియన్ల ముస్లిం మైనారిటీలు నారా చంద్రబాబు నాయుడు గారి రుణం కూడా తీర్చుకుంటారని చెప్పారు.
నూటికి నూరు శాతం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ఎవరైతే పాటుపడతారో వారి వెంటే రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల మైనారిటీలు ఏకపక్షంగా ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ముక్తార్ ఆలీ చెప్పారు. అయితే ముస్లింల సంక్షేమానికి పాటుపడకుండా వారిని పావులుగా, కరివేపాకుల్లాగా వాడుకోవాలని చూస్తే ఏ పార్టీ అయినా కూడా 2019 ఎన్నికల్లో అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ముస్లింలు ఏ పార్టీకి తొత్తులుగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు.
రాష్ట్రంలో అన్ని విధాలా అణచివేయబడ్డ ముస్లిం మైనారిటీలు తాము ఉండేందుకు నీడ లేక...సరైన ఉపాధి లేక పేదరికంతో జీవితాలు సాగిస్తున్నారన్నారు. ముస్లింల పరిస్థితి ఇలాగ ఉంటే నేడు రాజకీయ పార్టీలు ముస్లింలను పావులుగా వాడుకోవాలని అనుకుంటున్నాయని...ఇది మంచి పద్ధతి కాదన్నారు. ముస్లింలను కేసులతో భయపెట్టించి వారిని భయబ్రాంతులకు గురిచేస్తే అందుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ముస్లిం మైనారిటీల సభ గుంటూరులో విజయవంతంగా జరగటం అభినందనీయమని...కానీ కొందరు ఆడిన నాటకాలకు ముస్లిం మైనార్టీలను బలి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.