సిద్దాంతాలు, విధానాలు లేవా..?: అంతర్వేది ఘటన నిరసనలపై మంత్రి బొత్స ఫైర్..
విపక్షాలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఆందోళన చేసిన వారిని విడుదల చేయాలని రాజకీయ పార్టీలు కోరడం ఏంటీ అని అడిగారు. ప్రార్థనా మందిరాలపై రాళ్లు వేసిన వారిని విడుదల చేయాలని ధర్నాలు చేయడం భావ్యమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సంగతి పట్టించుకోరా.. అని ధ్వజమెత్తారు.
అధికారంలో ఏ పార్టీ ఉన్న రాజకీయ పార్టీలు బాధ్యతగా మసలుకోవాల్సిన అవసరం అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీ అంటే అవాకులు చెవాకులు మాట్లాడానికి, ఇతరులపై బురద చల్లడానికి ఉద్దేశించింది కాదన్నారు. ఓ విధానం ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. చంద్రబాబుకు ఇలాంటి సిద్ధాంతాలు, విధానాలు ఏవీ లేవని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు అవసరమైతే కాళ్లు.. తీరాక తిట్టిస్తారని బొత్స విమర్శించారు. మతానికి, దేవుడికి, రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఇదొ దుష్ట సంప్రదాయం కొనసాగుతోందని తెలిపారు. అయితే రాజకీయ పార్టీగా నిరసన తెలియజేసే హక్కు ఉంటుందని.. దానిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరామని బొత్స స్పష్టంచేశారు. అంతర్వేదిలో రథం కాలిపోయిందా, లేదంటే కాల్చారా అనే విషయం సీబీఐ విచారణలో తేలుతుందని బొత్స స్పష్టం చేశారు.