రాజకీయాల్లో కామన్: బూతులు తిట్టుకున్న సీఎం రమేష్, జీవీఎల్ చెట్టాపట్టాల్!
అమరావతి: శాశ్వత శతృవులు గానీ, శాశ్వత మిత్రులు గానీ ఉండరనేది రాజకీయాల్లో ఓ బేసిక్ ఫార్ములా. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ ఫార్ములా చుట్టే ప్రదక్షిణాలు చేస్తున్నాయనడంలో సందేహాలు అక్కర్లేదు. నిన్న మొన్నటి దాకా బహిరంగంగా బూతులు తిట్టుకున్న నాయకులు.. నేడు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ కనిపిస్తే చూసి కనుబొమలెగరేడం తప్ప చేయగలిగేదేమీ ఉండదు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పదాధికారుల సమావేశంలో అచ్చంగా ఇలాంటి సన్నివేశాలే కనిపించాయి. ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా.. పరస్పరం బూతులు తిట్టుకున్న తెలుగుదేశం పార్టీ మాజీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, బీజేపీ నాయకుడు తోటి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చిరకాల స్నేహితుల్లా కనిపించడం జనాలను ముక్కున వేలేసుకునేలా చేసింది. పదాధికారుల సమావేశంలో వారిద్దరూ కోరి మరీ పక్క పక్కనే కూర్చోవడం ఆశ్చర్యపరిచింది.
నిప్పు..ఉప్పుల్లా..
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ-బీజేపీ పొత్తు కొనసాగిన రోజుల్లో సీఎం రమేష్, సుజనా చౌదరి కేంద్రంలో ఓ వెలుగు వెలిగారు. ఎన్డీఏ-1 హయాంలో సుజనా చౌదరి కేంద్రమంత్రి వర్గంలో కొనసాగారు. కారణాలు ఏమైనప్పటికీ- ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చిందో.. అప్పటి నుంచీ కమలనాథులు నోరు మెదపడం మొదలు పెట్టారు. ప్రత్యేకించి- జీవీఎల్ నరసింహారావు. బీజేపీ తరఫున ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జీవీఎల్.. తెలుగుదేశం నేతలను టార్గెట్ గా చేసుకుని తరచూ విమర్శలు సంధించేవారు. ఎలక్ట్రానిక్ మీడియా డిబేట్లలో కనిపించేవారు. తోటి రాజ్యసభ సభ్యులైన సీఎం రమేష్, సుజనా చౌదరిలతో పాటు మరి కొందరు టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసేవారు.
జీవీఎల్ పై మీడియా సాక్షిగా బూతులు..
అదే సమయంలో సీఎం రమేష్ ఇంటిపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేయడంతో పరిస్థితులు మరింత బిగిసిపోయాయి. ఐటీ దాడులను అడ్డుగా పెట్టుకుని సీఎం రమేష్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఓ రేంజ్ లో చెలరేగిపోయిన విషయం తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశపూరకంగా దాడులు చేయిస్తున్నారంటూ ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నించిన జీవీఎల్ నరసింహారావుపై సీఎం రమేష్ బూతులు తిట్టిన సందర్భాలు అప్పట్లో చోటు చేసుకున్నాయి. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల తరువాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు కావడం అంటుంటారే అలాగన్నమాట.
గడ్డు కాలం అంటే ఇదేనేమో..
రాష్ట్రంలో తెలుగుదేశం అధికారాన్ని కోల్పోవడం, కేంద్రంలో బీజేపీ తన ప్రభుత్వాన్ని వరుసగా రెండోసారి నిలబెట్టుకోవడం జరిగిపోయాయి. ఫలితం- అందరికీ తెలిసిందే. ఉద్దేశమేదైనా అధికారాన్ని కోల్పోయిన అతి కొద్దిరోజుల్లోనే సీఎం రమేష్, సుజనా చౌదరి, తెలంగాణకు చెందిన గరికపాటి రామ్మోహన్ రావు మూకుమ్మడిగా పార్టీ ఫిరాయించారు. పుట్టినప్పటి నుంచీ తెలుగుదేశం పార్టీలో కొనసాగిన వారంతా రాత్రికి రాత్రి ప్లేటు మార్చారు. కాషాయ కండువాను కప్పుకొన్నారు. కమలం తీర్థాన్ని పుచ్చుకున్నారు. టీడీపీ నుంచి ఎంపికైన తమను బీజేపీ సభ్యులుగా గుర్తించాలని కోరుతూ ఏకంగా ఉప ప్రధాని ఎం వెంకయ్య నాయుడిని కలిశారు. ఆ తరువాత వారి మీద ఐటీ దాడులు ఆటోమేటిక్ గా ఆగిపోయాయి. జీవీఎల్, సీఎం రమేష్ మధ్య చోటు చేసుకున్న వాగ్యుద్ధ ప్రకంపనలు సద్దుమణిగిపోయాయి.
బీజేపీలో చేరిన తరువాత తొలిసారిగా..
బీజేపీలో చేరిన చాన్నాళ్ల తరువాత సీఎం రమేష్, సుజనా చౌదరి తొలిసారిగా తమ పార్టీ రాష్ట్ర కార్యాలయం గడప తొక్కారు. రాజధాని అమరావతి ప్రాంతంలో గల పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటైన పదాధికారుల సమావేశంలో వారిద్దరూ పాల్గొన్నారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్, లోక్ సభ మాజీ సభ్యుడు జీ హరిబాబు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రమేష్, జీవీఎల్ హుషారుగా పరస్పరం పలకరించుకున్నారు. ఒకరి చెయ్యి ఒకరు అందిపుచ్చుకున్నారు. భుజాలపై చేతులు వేసి మరీ మాట్లాడుకున్నారు. అనంతరం వేదిక మీద పక్క, పక్కనే కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు.