పవన్ ఆలోచన అలా..! అనంతలో ఇలా..! కుల ఫ్లెక్సీలపై ఆసక్తికరం
అనంతపురం : ప్రస్తుత రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు ఎంతటి పాత్ర పోషిస్తున్నాయో అందరికీ తెలిసిందే. కేవలం సామాజిక వర్గం ఓట్లను టార్గెట్ గా చేసుకుని ఆయా పార్టీలు ఓటు బ్యాంకులు వ్యూహాలను రచించుకోవడం ప్రస్తుత రాజకీయాల్లో ప్రతీ పార్టీ చేస్తోన్న పనే. ఇక ఇప్పుడిప్పుడే పొలిటికల్ గా యాక్టివ్ అవుతోన్న జనసేన కూడా.. భవిష్యత్తులో ఈ సామాజిక సమీకరణాలతోనే ముందడుగు వేయబోతుందా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
ఉన్నట్టుండి.. ఇప్పడీ సందేహం ఎందుకు తెరపైకి వచ్చిందంటే.. అనంతలో జరిగే జనసేన సభ కోసం ఆయా కుల సంఘాల ప్రతినిధులు పార్టీతో చేతులు కలుపుతుండడంతో ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంతలో జరగబోయే జనసేన సభ కోసం.. ఆయా కుల సంఘాల ప్రతినిధులు 'మాదిగ సేన, బోయ సేన, బలిజ సేన, బీసీ సేన..' ఇలా కులాల పేరిట పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ పలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు.
ఓవైపు తన సొంత సామాజిక వర్గమైన కాపు ఉద్యమం అంతగా ఉధృతమైనప్పుడే.. కుల ప్రస్తావనలకు తన రాజకీయాల్లో చోటు కల్పించవద్దనే ఉద్దేశ్యంతో పవన్ కాపు ఉద్యమం గురించి ఇప్పటికీ 'నో కామెంట్' ధోరణినే అనుసరిస్తున్నారు. అలాంటి పవన్ కు ఇలాంటి కుల సంఘాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నప్పటికీ.. ఇదంతా వ్యూహాత్మకమే అనేవారు కూడా లేకపోలేదు.
కుల సంఘాల్లో పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టడం ద్వారా భవిష్యత్తులో పార్టీకి పటిష్ట పునాదులను ఏర్పాటు చేయాలనే యోచనలో భాగంగానే.. ఇలా కుల సంఘాల ఫ్లెక్సీలు దర్శనిమిస్తున్నాయనేది పలువురి వాదన. ఏదేమైనా పవన్ ధోరణి మాత్రం కులాల ప్రస్తావనకు దూరంగానే ఉంటూ వస్తోంది. మరలాంటప్పుడు.. కుల సంఘాల ప్రతినిధులు జనసేన సైనికులుగా మారడం.. కులం పేర పార్టీని భుజానికెత్తుకోవడం.. పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణికి సరిపోయే విషయమేనా అన్నది పవన్ తన సొంత అభిప్రాయం ద్వారా వ్యక్తీకరిస్తే గానీ తేటతెల్లం కాని విషయం.