వాట్ ఏ వెరైటీ.. ఏపిలో వారసుల వాపస్..! రాజకీయాల నుండి వ్యాపారం వైపు అడుగులు..!
అమరావతి/హైదరాబాద్: ఏపి రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చి బొక్కబోర్లా పడ్డ రాజకీయ వారసులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్తితిలో పడిపోయారు. వ్యాపారాలు మానుకుని, విదేశాల్లో ఉద్యోగాలు మానుకుని ఏపి రాజకీయాలను ఉద్దరిద్దామని వచ్చిన రాజకీయ నేతల వారసులకు 2019 సాధారణ ఎన్నికలు ఖంగు తినిపించాయి. అంతే కాకుండా రాజకీయ వారసత్వాన్ని అందివ్వానుకున్న వారికి కూడా ఈ ఎన్నికలు గట్టి గుణపాఠం బోదించాయి. ఎన్నికల్లో గెలవలేక, అదికార పార్టీలో చేరలేక, ఐదేళ్లు ప్రజా సేవ చేసే ఓపిక లేక రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకుందామని వచ్చిన వారసులు మళ్లీ వెనక్కు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
రాజకీయ వారసుల పట్ల శరాఘాతంగా మారిన ఎన్నికలు..! ఫ్యూచర్ అయోమయం..!!
పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టైంది ఏపిలో రాజకీయ నేతల వారసుల పని. ఏపీలో కొంత మంది టీడిపి నేతలు వారి వరాసుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. దశాబ్దాల పాటు జిల్లాలో తిరుగులేని నాయకులుగా.. గెలుపోటముల్లో తమ ఇమేజ్ను కాపాడుకుంటూ వచ్చిన నాయకులకు తనయుల వల్ల డ్యామేజీ తప్పలేదు. అదంతా ఓ వైపు. మరోవైపు.. తండ్రుల చాటున రాజకీయ ఓనమాలు నేర్చుకుని తెరమీదకు వచ్చిన ఎంతోమంది యువ నేతలు.. ఎందుకో ప్రజల మనసు గెలవలేకపోయారు. అది ఏపీ, తెలంగాణ రెండుచోట్ల కనిపించినా.. దానితాలూకూ ఎక్కువ ప్రభావం ఏపీలో కనిపించింది. మాస్ లీడర్లుగా గుర్తింపు తెచ్చుకుందామనుకున్న నేతలు ఎవ్వరు కూడా ప్రజల మనసును గెలవలేక పోయారు.
ఎలాంటి ఆధారాలు లేవు.. మీటూ కేసులో నానాపటేకర్కు పోలీసులు క్లీన్చిట్..
కొడుకులు ముంచిన రాజకీయ జీవితం..! అంధకారంలో భవిశ్యత్తు..!!
అయితే బోండా ఉమా, అయ్యన్నపాత్రుడు, కేఈ, జేసీ బ్రదర్స్ వంటి వారు.. తనయుల పెత్తనం కొంపముచ్చింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పేరున్న నేతల తనయులు.. టీడీపీలో తమ లక్ పరీక్షించుకుందామనుకుని ఘోరంగా పరాజయం చవిచూశారు. దీంతో రేపటి తమ భవితవ్యంపై మధనపడుతున్నారట. 2024 నాటికి పరిస్తితులు ఎలా ఉన్నా.. ప్రస్తుతం తమ ఉనికి.. కార్యకర్తలను కాపాడుకునేందుకు సరైన రాజకీయ వేదిక కోసం చూస్తున్నారట.
రాజకీయ నేతల్లో నైరాశ్యం..! వ్యాపార రంగం వైపు వ్యూహాలు..!!
ఆ వరుసలో ముందుగా వినిపించేది దేవినేని అవినాష్, వంగవీటి రాధా, భూమా అఖిలప్రియ, గాలి జనార్దన్రెడ్డి వారసులు, కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, జేసీ పవన్రెడ్డి, పరిటాల శ్రీరామ్, చింతకాయల విజయ్.. ఇలా చాంతాడంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో అధికశాతం రాజకీయంగా పరిణితి చెందని వారే ఉన్నారు. ఇంకొందరికి తండ్రిచాటు బిడ్డలుగా కేవలం జల్సాలకు అలవాటుపడిన చరిత్ర ఉంది. ఇటువంటి వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తే లాభాలకంటే నష్టమే అధికమనే భావన ఆయా పార్టీల నేతలు ఉన్నారట.
పార్టీ మారుదామనుకున్నా కుదరని పరిస్థితులు..! మూసుకుపోయిన దారులు..!!
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. పైగా వైసీపీ నేతలు మోదీపట్ల సానుకూల ధోరణితో ఉన్నారు. కాబట్టి వైసీపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను బీజేపీలోకి చేరటం ద్వారా అధిగమించవచ్చనేది వీరి ఆలోచనగా మారిందట. ఏడాదిపాటు మోదీను ఇష్టానుసారం విమర్శించి ఇప్పుడు అదే కాషాయనీడలో ఉండేందుకు బీజేపి సీనియర్లు అంగీకరించట్లేదట. ముఖ్యంగా కన్నా, పురందేశ్వరీ వంటి వారు వద్దని వారిస్తున్నారట. మరి వీరిని మచ్చికచేసుకుని.. ఆత్మరక్షణ కోసం పార్టీలోకి ఎలా జంప్ చేయాలనే ప్లాన్లో యువ నేతలు ఉన్నారట. అయితే వీరిలో వంగవీటి రాదా మాత్రం.. బెంగళూరు వెళ్లిపోయి వ్యాపారంలో స్థిరపడిపోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాధా దారిలో మరికొంత మంది వారసులు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.