కూతురు 'న్యూడ్ ఫోటో'లతో పొలిటీషియన్ బ్లాక్ మెయిల్ : ఓ బాధితుడు
కాకినాడ : వ్యక్తిగత భూవివాదాల్లో పైచేయి సాధించేందుకు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మార్ఫింగ్ ద్వారా తన కూతురు నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని కొంతమంది ప్రజా ప్రతినిధులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు రామారావుపేటకు చెందిన ఎస్ రవి అనే న్యాయవాది జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కాగా.. తన ఫిర్యాదు పట్ల స్పందించిన మానవ హక్కుల సంఘం దీనిపై సమగ్ర విచారణకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించినట్టుగా బాధితుడు మంగళవారం విషయాన్ని మీడియాకు వివరించారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వాళ్లు తన కూతరు అర్ధనగ్న ఫొటోలను తనకు చూపించి బయటకు లీక్ చేస్తామని బెదిరిస్తున్నారంటూ తెలిపారు. దీనిపై ఈ ఏడాది జవనరి 26వ తేదీన కాకినాడ టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు బాధితుడు.
చిక్కుల్లో టీడీపీ ఎంపీ : 'న్యూడ్ ఫోటో'లు పంపిస్తున్నారంటూ ఫిర్యాదు
అయితే.. తాను ఫిర్యాదులో పేర్కొన్నది ప్రజాప్రతినిథి అనుచరులు కాబట్టి పోలీసులు కూడా చూసీ చూడనట్టే వ్యవహరించారని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించానని తెలిపారు బాధిత న్యాయవాది.
అంతకుముందు హైదరాబాద్లోని సిఐడి అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని, అయితే అక్కడి అధికారులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో చివరిగా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించానని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో మానవ హక్కుల సంఘం దీనిపై విచారణకు రాష్ట్ర డిజిపిని ఆదేశించిందని చెప్పారు.
ప్రజా ప్రతినిథిపై ఆరోపణల్లో నిజం లేదు : డిఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు
ఇదిలా ఉంటే దీనిపై స్పందించిన కాకినాడ డిఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు బాధిత న్యాయవాది ఆరోపణలను కొట్టిపారేశారు. ఓ ప్రజాప్రతినిధి అనుచరులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ న్యాయవాది చేసిన ఆరోపణలన్ని అవాస్తవమేనని తెలిపారు.
కాకినాడకు చెందిన ప్రజాప్రతినిథిపై మంగళవారం రాత్రి ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు డీఎస్పీ. అయితే ప్రజాప్రతినిధి అనుచరులు తన కూతురి నగ్న చిత్రాలతో బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని, సదరు న్యాయవాది మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడం, కమిషన్ పోలీస్ ఉన్నతాధికారులను విచారణకు ఆదేశించడం మాత్రం వాస్తవమేనని తెలియజేశారు.
అయితే న్యాయవాది తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏ ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారని, ఇదే విషయాన్ని తాము మానవ హక్కుల కమిషన్ కు నివేదించామని చెప్పారు డిఎస్పీ .అంతేకాదు సదరు న్యాయవాది మానసిక స్థితి కూడా సరిగా లేదన్న విషయం తమ విచారణలో తేలిందని వెల్లడించారు.