YS Sharmila నోట జై తెలంగాణ మాట- రంగారెడ్డి హైదరాబాద్ నేతలతో ఆత్మీయ సమ్మేళనం,వ్యూహమేంటి..?
తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల పెట్టబోతున్న కొత్తపార్టీపై ఇప్పుడు రాజకీయవర్గాలు ఫోకస్ పెట్టాయి. వైయస్ షర్మిల వేస్తున్న అడుగులను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న షర్మిల, రాజన్న రాజ్యం తీసుకురావడానికి పార్టీ పెడతామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడం కోసం వైయస్ఆర్ అభిమానులతో, నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి పని చేసిన అధికారులతో, రాజకీయ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణాలో టీడీపీ ప్రస్తుత పరిస్థితిని చెప్పి వైఎస్ షర్మిల పార్టీపై ఎర్రబెల్లి షాకింగ్ కామెంట్స్
అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశం .. 11 ప్రశ్నలతో వారికి ఫీడ్ బ్యాక్ ఫామ్
ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన నాయకులు , అభిమానులతో వైయస్ షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. లోటస్ పాండ్ లో జరుగుతున్న ఈ సమావేశానికి దాదాపు ఐదు వందల మందిని ఎంపిక చేసిన షర్మిల వారితో తన రాజకీయ దృక్పధాన్ని స్పష్టంగా చెప్పారు . ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేయాల్సినవి చేస్తుందా ? టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చిందా ? తెలంగాణలో ఉన్న సమస్యలపై మాట్లాడదామని అభిమానులతో పేర్కొన్న ఆమె 11 ప్రశ్నలతో వారికి ఫీడ్ బ్యాక్ ఫామ్ నింపాలని సూచించారు.
జై తెలంగాణ నినాదం తో సమావేశం ప్రారంభించిన షర్మిల
ఈ సమావేశాన్ని జై తెలంగాణ నినాదం తో షర్మిల ప్రారంభించడం అందర్నీ ఆకట్టుకుంది.
ఇప్పటికే వైఎస్ షర్మిల నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడి, అక్కడి సమస్యలు తెలుసుకుని, నల్గొండ నేతల పూర్తి మద్దతు తనకు ఉందని చెప్తున్నారు. పార్టీ ఏర్పాటుకు ముందే అన్ని జిల్లాల నేతలతో భేటీలు పూర్తిచేయాలని వేగంగా సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల కార్యాచరణలో వేగంగా పావులు కదుపుతున్నారు . ఓవైపు పార్టీ నిర్మాణం పై ఫోకస్ పెడుతూనే, మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తెలుసుకోడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఆత్మీయ సమావేశాలు ,ఆపై జిల్లాల పర్యటనలు .. షర్మిల రాజకీయ వ్యూహం
ఆత్మీయ సమావేశాలను పూర్తి చేసిన తర్వాత షర్మిల జిల్లాల పర్యటన చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఇప్పటికే వైయస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు, పార్టీ లక్ష్యాలను సమావేశమవుతున్న నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు తనతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ముందుకు సాగేందుకు వచ్చే నేతల అభిప్రాయాలను, సలహాలను, సూచనలను కూడా తీసుకుంటున్నట్లుగా సమాచారం. అందరి సలహాలు , సూచనలు క్రోడీకరించి ఆమె తగిన నిర్ణయాలు తీసుకుని రాజకీయంగా ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు.
షర్మిల అడుగులపై సర్వత్రా చర్చ ..
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో షర్మిల జిల్లాల పర్యటనలు వాయిదా పడినా ఆమె వేగంగానే అడుగులు వేస్తున్నట్లుగా తాజా సమావేశాల ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ తో షర్మిల ప్రస్థానం ఎలా సాగుతుంది అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారిన చర్చ.
అన్ని రాజకీయ పార్టీలు షర్మిల వేస్తున్న అడుగులను సునిశితంగా పరిశీలిస్తున్నాయి.