శుభలేఖలు, పెళ్లి ముచ్చట్లు: అసెంబ్లీ లాబీల్లో ఇలా!, స్వీట్లు పంచిన చినరాజప్ప..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీ బ్రేక్ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా డిప్యూటీ సీఎం చినరాజప్ప ఛాంబర్ వైపు వెళ్లారు.
అమరావతి: కార్తీక మాసం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి వేడుకల జోరు పెరిగింది. అటు అసెంబ్లీ సమావేశాల్లో పెళ్లి పిలుపుల ముచ్చట్లు బాగానే వినిపిస్తున్నాయి.
Recommended Video
శుక్రవారం నాడు అసెంబ్లీ లాబీల్లో పలువురు ప్రముఖులు శుభలేఖలతో సందడి చేశారు. తమ ఇంటి వేడుకకు ఆహ్వానించేందుకు వచ్చిన ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ అయితే అందరూ కలుస్తారన్న ఉద్దేశంతోనే చాలామంది శుభలేఖలతో నేరుగా అక్కడికే వెళ్తున్నట్టు తెలుస్తోంది.
యామిని బాల కుమార్తె వివాహం
ప్రభుత్వ విప్ యామినీ బాల కుమార్తె వివాహం ఈ నెల 16న అనంతపురంలో జరగనుంది. ఈ శుభకార్యానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ ఆమె ఆహ్వానించారు. ఇక సినీ నటుడు, నిర్మాత అశోక్ కుమార్ సైతం తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు శుభలేఖలతో అసెంబ్లీకి వచ్చారు. పలువురు ఎమ్మెల్యేలకు ఆయన శుభలేఖలు అందించారు.
పయ్యావుల సోదరుడి కుమార్తె వివాహం
టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సోదరుడి కుమార్తెకు కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ కుమారుడితో ఈ నెల 23న వివాహం జరగనుంది. దీంతో శుభలేఖలతో అసెంబ్లీకి వచ్చిన ఆయన.. ప్రతీ మంత్రిని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పెళ్లికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
ఆ రెండు రోజుల్లో ఎక్కువగా:
మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కూడా తమ ఇంట్లో జరిగే వివాహా వేడుక కోసం ప్రజా ప్రతినిధులను ఆహ్వానించేందుకు అసెంబ్లీకి వచ్చారు. శుభలేఖలతో అసెంబ్లీ లాబీల్లో కనపడ్డారు.
ఈ నెలలో ఎక్కువ వివాహాలు 23, 25వ తేదీల్లోనే ఉన్నాయని ఎమ్మెల్యేలు, మంత్రులు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఈ నెల 25వరకు ఉండటంతో శుభకార్యాలకు హాజరవడం సాధ్యమవుతుందా? అన్న దాన్ని పరిశీలిస్తున్నారు.
చినరాజప్ప 'స్వీట్స్'
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీ బ్రేక్ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా డిప్యూటీ సీఎం చినరాజప్ప ఛాంబర్ వైపు వెళ్లారు. అప్పటికే తెప్పించి పెట్టిన స్వీట్లను చినరాజప్ప వారికి పంపిణీ చేశారు. దీంతో 'అసెంబ్లీ సమావేశాలు ఉంటే చాలు.. గోదావరి ప్రాంత చిరుతిళ్లు రుచి చూడొచ్చు' అని ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
దీంతో 'మరి షుగర్ ఉన్నవాళ్ల పరిస్థితేంటి?' అని మరో ప్రజాప్రతినిధి ప్రశ్నించారు. అందుకే బెల్లం ఉండలు తెచ్చామంటూ డిప్యూటీ సీఎం బదులివ్వడంతో అంతా నవ్వుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కరోజుకు స్వీట్స్ తీసుకుంటే.. ఏం ఫర్వాలేదంటూ డిప్యూటీ సీఎం వారి చేత మొత్తానికి స్వీట్స్ తినిపించారట.