ఏకతాటి పైకి తెచ్చారు: పవన్ కళ్యాణ్ చెప్తే.. బాలకృష్ణ చేశారు!
హైదరాబాద్: రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెబితే, నేడు అదే విషయాన్ని హిందూపురం టిడిపి ఎమ్మెల్యే, యువరత్న బాలకృష్ణ చేసి చూపించారని అంటున్నారు. శుక్రవారం నాడు బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణీ చిత్రం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఎంతోమంతి అతిరథ మహారథులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఎంపీ, మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణ రావు తదితర ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణలో టిడిపి వర్సెస్ టిఆర్ఎస్గా ఇటీవలి వరకు జోరుగా రాజకీయాలు కనిపించాయి. ఇక చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లారు. అదే సమయంలో చిరుకు, దాసరికి మధ్య సత్సంబంధాలు లేవు అనే వాదనలు ఉన్నాయి. అయినప్పటికీ బాలకృష్ణ అందర్నీ ఏకతాటిపైకి తెచ్చారని చెబుతున్నారు.
తద్వారా రాజకీయాలు, సినిమాలు వేరు అని బాలకృష్ణ నిరూపించారని చెబుతున్నారు. తన వందో చిత్ర ప్రారంభోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. సినిమా రంగంలో చిరంజీవి, బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, నాగార్జునలు నిన్నటి దాకా టాప్ హీరోలు. వారిని కూడా బాలయ్య ఆహ్వానించారు.
ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి సూటిగా మాట్లాడారు. తాను తన అన్నయ్యకు అండగా ఉంటానని, కుటుంబపరంగా అన్నయ్యకు గౌరవం ఇస్తానని, రాజకీయాల్లో మాత్రం తమ ఇద్దరి దారులు వేరు అని చెప్పారు.
రాజకీయాలు వేరు, కుటుంబం వేరు అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అనే దానిని పాటించారంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోవచ్చు. తన వందో చిత్రంలో వివిధ పార్టీల నేతలను ఆయన ఒక్కతాటి పైకి తెచ్చారు.