2014 తర్వాత ఏపిలో మారిన రాజకీయం..! పవన్ ప్రభావితం చేస్తారా..!?
అమరావతి/ హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహా రచనలు చేస్తున్నాయి పార్టీలు. పొత్తుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అంతే కాకుండా వివిద సర్వేలు ఏపిలో అదికార మార్పిడి జరుగుతుందని విశ్లేషిస్తున్న తరుణంలో రాజకీయంగా నేతలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అందరి కళ్లూ జనసేన పార్టీ పైనే కేంద్రీకరించారు. 2014లో ఏపి రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపించిన పవన్ కళ్యాణ్ ఈ సారి ఆయన స్థాపించిన జనసేన ఎలాంటి పరిణామాలు తీసుకొస్తుందనే అంశం పై మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజెపి, టీడిపి కి మద్దత్తు తెలిపిన పవన్ ఈ సారి ఎలాంటి మార్పుకు కేంద్ర బిందువు అవుతారో అనే అంశం పై పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది.
ఏపిలో శరవేగంగా మారుతున్న రాజకీయం..! ప్రభావం చూపనున్న పవన్..!!
ఏపి లో రాజకీయ మార్పులు చకచకా జరిగిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సంసిద్దమౌతున్నాయి పార్టీలు. అదికార పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను కూడా ప్రకటిస్తోంది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా సమన్వయకర్తల బలాబలాలను అంచనా వేస్తోంది. కొన్నిచోట్ల బలహీనంగా ఉన్న సమన్వయకర్తలను బుజ్జగించి తప్పించాలనుకుంటోంది. అక్కడ ఆర్ధికంగా, సామాజికంగం బలమైన మరో అభ్యర్థిని నిలపాలని లెక్కలు వేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలున్నా వాటి ప్రభావం ఎన్నికల్లో నామమాత్రమే అనే అంచనాలు వేసుకుంటున్నాయి వైసీపీ, టీడీపీ పార్టీలు. మరి జనసేన.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ తమను గట్టెక్కించిందని అప్పట్లో చెప్పిన టీడీపీ నేతలు తాజాగా ఆ పార్టీ పట్ల ఎలా వ్యవహరించబోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.
2014లో గబ్బర్ సింగ్ సహకారంతో గట్టెక్కిన టీడిపి..! తాజా పరిస్థితిపై ఉత్కంఠ..!!
వైసీపీ అయితే పవన్తో మాకు పోటీ కానే కాదంటూ కుండబద్దలు కొడుతోంది. ఇటీవల జాతీయస్థాయి సర్వేల్లోనూ వైసీపీ, టీడీపీను పరిగణలోకి తీసుకున్నారు మినహా జాతీయపార్టీలతో పాటు జనసేనను పక్కకు నెట్టినంత పనిచేశాయి. వాస్తవానికి పవన్ బలహీనత, టీడీపీ. ఆయన బలం కూడా టీడీపీయే. ఆ పార్టీతో కలసి ఉంటే చంద్రబాబు ప్రోద్బలంతో పాటు మీడియా సపోర్టు ఉండేది. ఆయన చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలు అంత వెలుగుచూసేవి కూడా కాదు. కాని పవన్ తెలుగుదేశం పార్టీకి మద్దత్తు ఉపసంహరించుకోవడంతో అసలు సమస్య తలెత్తింది.
అరే ఓ సాంబా.. రాసుకోరా..! ఆ రెండు జిల్లాలు మనవే అంటున్న పవర్ స్టార్..!!
ఇప్పుడు టీడీపీతో బద్ద శత్రువుగా వ్యవహరిస్తున్నారు కాటమ రాయుడు. గతంలో ఉన్న దూకుడును కాస్త తగ్గించారు. తన దృష్టి పూర్తిగా ఉభయ గోదావరి జిల్లాలపై ఉంచారు. ఉత్తరాంధ్ర, అనంతపురం, గుంటూరు జిల్లాల్లోనూ ఫోకస్ పెట్టారు. ఈ లెక్కన పవన్ నాలుగైదు జిల్లాల్లో ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, కాపు ఓటర్లు, ముస్లిం మైనార్టీలు ఎస్సీలు, యువత పవన్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ సెగ్మెంట్లో కూడా అధికశాతం యువత, మహిళలు ఉండటం టీడీపీ, వైసీపీలను ఒకింత ఆలోచనలో పడేస్తోంది.
పవన్ ఎవరి ఓట్లను కొల్లగొడతారు..! టీడిపి, వైసీపిలో నెలకొన్న టెన్షన్..!!
వైసీపీ నవరత్నాలతో అన్ని వర్గాలు తమ కే మద్దతు ఇస్తాయనుకుంటోంది. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా, జనసేనకు చీలే ఓట్లు గతంలో పవన్ను చూసి వేసిన ఓటర్లవేనంటూ వైసీపీ జబ్బలు చరచుకుంటోంది. కాని ఇప్పుడు మాట మార్చి అదేం కాదంటోంది వైసీపి. వైసీపీలోని కాపులు, ఎస్సీల ఓట్లే చీలతాయంటూ టీడీపీ భావిస్తోంది. అయితే, ఈ లెక్కన ఎవరో ఒకరి ఓట్లు మాత్రం జనసేన చీల్చుకోవటం మాత్రం తథ్యం. అయితే.. ఎక్కువ ఓట్లు పోగొట్టుకున్న పార్టీ కొద్దిపాటి తేడాతో అయినా ఓటమి చవిచూస్తుందనేది విశ్లేషకుల అంచనా. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ జనసేన, టీడీపీ, వైసీపీల్లో ఎవరో ఒకరి పుట్టి ముంచడం మాత్రం వాస్తవమనే చర్చ జరుగుతోంది.