క్రీడలపై ‘పొలిటికల్’ నీడ: అనర్హులకు సర్టిఫికెట్లు.. ఏపీలో ఒలింపిక్స్ అసోసియేషన్ నిధులు స్వాహా?
అధికారం అండ ఉంటే చాలు ఏదైనా చేయొచ్చని గట్టి ధీమా.. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాంకో అధినేత.. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..
హైదరాబాద్/ అమరావతి: అధికారం అండ ఉంటే చాలు ఏదైనా చేయొచ్చని గట్టి ధీమా.. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాంకో అధినేత.. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవిని కైవసం చేసుకునేందుకు వెనుకాడలేదు.
అందుకు పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావును తోసి రాజని తెర వెనక రాజకీయం ద్వారా ఒలింపిక్ అసోసియేషన్లో పాగా వేశారు. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర క్రీడా సంఘాల్లో ఆ పార్టీ నేతల తనయులదే ఇష్టారాజ్యం మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు ఉప్పూనిప్పూగా ఉన్న ఏపీ మంత్రి పరిటాల సునీత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పుత్ర రత్నాలు ఆగడాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేశ్ అండదండలు ఉన్నాయని తెలుస్తున్నది. డబ్బు సంపాదనకు క్రీడా సంఘాలు ఎలా వేదిక కల్పిస్తున్నాయో, అలా వాటిల్లో అడుగు పెట్టేందుకు అధికారమూ కీలక పాత్ర పోషిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం, ఆయన అనుచరులు.. అనంతపురం లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్రెడ్డి వంటి అధికార టీడీపీ నేతల జోక్యంతో క్రీడారంగం వివాదాస్పదంగా మారుతున్నది. నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణంలో పరిటాల శ్రీరాం అస్మదీయుల బాగోతం బయటపడితే.. ఒలింపిక్ అసోసియేషన్ నిధులు అక్రమంగా డ్రా చేశారని జేసీ పవన్ కుమార్రెడ్డిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. దీంతో ఇరువురిపై కోర్టులో క్రిమినల్, సివిల్ కేసులు నమోదు కావడంతో అనంతపురం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు నెలకొల్పుతున్నాయి.
ఎంసెట్లో ర్యాంక్ కోసమే అడ్డదారులు
అనంతపురం జిల్లాలోని సాఫ్ట్బాల్, ఫెన్సింగ్, జూడో అసోసియేషన్లదే ఇష్టారాజ్యమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం కోర్టులో దిగకపోయినా మ్యాచ్ ఆడినట్లు చూపి సర్టిఫికెట్ల వ్యాపారం చేశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్బాల్, ఫెన్సింగ్ రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశ్, మురళీకృష్ణ ఏపీ మంత్రి పరిటాల సునీత పరిటాల శ్రీరాంకు అస్మదీయులుగా ఉన్నారు. శ్రీరాం అండతోనే సర్టిఫికెట్ల వ్యాపారం సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రముఖ వ్యక్తులు హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఓ అధికారి కుమారుడు ఆడకపోయినా ఫెన్సింగ్ ఆడినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని సమాచారం. న్యాయశాఖలో పనిచేసే ఓ వ్యక్తి కుమారుడికి కూడా ఆడకుండానే సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిసింది. ఎంసెట్లో సీటు సాధించేందుకే ఈ సర్టిఫికెట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లు సర్టిఫికెట్ల వ్యాపారం చేస్తుండటంతో భవిష్యత్లో ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి ప్రముఖులు అండగా ఉంటారనే కారణంతోనే ముఖ్యమైన అధికారులు, రాజకీయనేతల పిల్లలకు ఇలా సర్టిఫికెట్లను కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
ఒలింపిక్ అసోసియేషన్ నిధులిలా దుర్వినియోగం
ఎంపీ దివాకర్రెడ్డి కుమారుడు జేసీ పవన్కుమార్రెడ్డి నిధులు దుర్వినియోగం చేశారని ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం చెప్పడంతో పవన్ కూడా 2016లోనే వివాదాల్లోకి వచ్చారని స్పష్టమవుతోంది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఒలింపిక్ అసోసియేషన్లు ఉన్నాయి. ఇందులో సీఎం రమేశ్ వర్గంలో జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జేసీ పవన్కుమార్రెడ్డి ఉన్నారు. గల్లా జయదేవ్ వర్గంలో పరిటాల శ్రీరాం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ వివాదాల్లో ఉన్న సమయంలో అసోసియేషన్కు సంబంధించి పలు బ్యాంకు అకౌంట్లను పురుషోత్తం వర్గం ఫ్రీజ్ చేసింది. అయితే 2016 జూన్ 9న ఫ్రీజ్ చేసిన అకౌంట్ల నుంచి రూ.18 లక్షలు డ్రా చేశారని జేసీ పవన్, సీఎం రమేశ్తో పాటు జీసీ రావు అనే మరో వ్యక్తిపై హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీసుస్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కోర్టులో కూడా సివిల్, క్రిమినల్ కేసు దాఖలయ్యాయి.
తెర వెనుక జయదేవ్, సీఎం రమేశ్ అండదండలు
సర్టిఫికెట్ల కుంభకోణం, నిధుల దుర్వినియోగం లాంటి అంశాలు తెరపైకి రావడం, ఇందులో అనంత పురం వాసులే ఉండటంతో జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో అనంతపురం జిల్లా పరువు బజారు పాలవుతున్నది. అసలు క్రీడలతో సంబంధం లేని వ్యక్తులు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు అసోసియేషన్లలోకి ప్రవేశించి శాసిస్తుండటంతోనే ఇలాంటి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మాజీ క్రీడాకారులు అంటున్నారు. ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్బాల్, క్రికెట్తోపాటు చాలా క్రీడల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఇప్పుడు తెరపైకి వచ్చినవేకాక, రాని అంశాలు అనేకం ఉన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వీటిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. క్రీడారంగంలో లేనివారికి అసోసియేషన్లో చోటు కల్పించకుండా నిషేధం విధించి, మాజీ క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.