పరకాష్ట రాజకీయం.!లోటు బడ్జెట్ లో ఉంటేనే ఇన్ని కుంభకోణాలైతే,మరి మిగులు బడ్జెట్ లో ఉంటే ఏంటి పరిస్దితి
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రజా సంక్షేమం దిశగ అడుగులు వేస్తున్నాయా లేక రాజకీయ ప్రతీకారం దిశగా అడుగులు పడుతున్నాయో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ఆదాయం గణనీయంగా పడిపోయింది. దాదాపు 15వేల కోట్ల లోటు బడ్జెట్ లో రాష్ట్రం కార్యకలాపాలు నెట్టుకొస్తోంది. రాష్ట్ర ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉండడంతో కేంద్రం నుండి పన్నులు, పంపకాల రూపంలో వచ్చే నిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్దితులు నెలకొన్నాయి. ఆర్దికంగా ఇంతటి దయనీయ స్ధితిలో ఉన్న రాష్ట్రంలో కూడా వివిధ రకాల ప్రభుత్వ పథకాల పేరుతో కుంభకోణాలు జరుగుతున్నాయంటే ఛీ ఇదేంటని అనుకునే సందర్బాలు చోటుచేసుకుంటున్నాయి.
ఏపీలో మొదలైన అరెస్టుల రాజకీయం..ఈఎస్ఐ స్కామ్ కు కారకుడంటూ అచ్చెన్నాయుడు అరెస్టు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చేయడమే ఉఛ్వాస నిఛ్వాసలుగా కాలం వెళ్లదీస్తుంటారు కొంత మంది నాయకులు. సమయం సందర్బంతోపని లేకుండా ఎదుటి వారిని రాజకీయంగా దెబ్బ కొట్టడమే జీవిత పరమార్ధం అన్నటు జీవిస్తుంటారు. అసలు రాజకీయాల్లోకి ఎందుకొచ్చామన్నది పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలకే కొంత మంది నేతలు ఎక్కువ ప్రాదాన్యతనిస్తారు. అందుకోసం అధికార పార్టీ మీద ప్రతిపక్షపార్టీ. ప్రతిపక్ష పార్టీ మీద అధికార పార్టీ కక్షసాధింపు చర్యలకు పథకాలు రచిస్తూనే ఉంటారు. సాదారణంగా లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాలు రాజకీయాలను పక్కన పెట్టి సంపద సృష్టించుకునే అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంటాయి. అనేక మార్గాల్లో పెట్టుబడులకు ఊతం ఇస్తూ రాష్ట్ర ఖజానానే బలోపేతం చేసుకునేందుకు శ్రమిస్తుంటాయి.
లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ.. నిధుల దోపిడీ ఆలోచన దుర్మార్గమే..
రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపికి తొలి ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే నిరర్ధకంగా ఉన్న ఎర్ర చందనం దుంగలను బహిరంగ వేలం వేసి లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి సుమారు 4వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపించారు. సంపద సృష్టించుకోవడం, ఆదాయ మార్గాలను రెట్టిపుచేసుకోవడం వల్ల రాష్ట్రం ఇతర అభివృద్ది చెందుతున్న రాష్ట్రాలతో పోటీ పడే అవకాశాలు ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అలా ఆదాయం మీద దృష్టి సారించి, ఉపాది, ఉద్యోగావకాశాలను పెంపొందించకుండా రాజకీయంగా పై చేయి సాదించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు ఎంత వరకు ఆహ్వానిస్తారనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది.
ప్రజా సంక్షేమం పట్టని పార్టీలు అధోగతి పాలవ్వడం ఖాయం.. ఏపిలో జరుగుతున్న వింత పరిణామాలు..
అంతే కాకుండా రాజకీయ నాయకుడు తప్పు చేస్తున్నాడని సామాన్య ప్రజానికం ఎక్కడా చెప్పదు. కనీసం ఉత్తరం కూడా రాయదు. సమయం సందర్బం వచ్చినప్పుడు మాత్రం ఓటు అనే ఆయుధంతో నడ్డి విరగ్గొడతారు. అందుకు ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా చాలా సమయం ఉన్నప్పటికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం తోటి రాష్ట్రాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. అసలు లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కాదని కేవలం స్వప్రయోజనాల కోసం రాజకీయాల్లోకొచ్చి బావుకునేదేముంటుందనేది కూడా ఆసక్తిరేపుతున్న అంశమే. అనేక రంగాలకు కేటాయింపులు చేసిన బడ్జెట్ లో నిధుల పంపిణీ మాత్రం అంతటి స్దాయిలో ఉండదు. కీలక శాఖలకు మినహా ఇతర శాఖలకు కేటాయింపులు బడ్జెట్ లో పేర్కొన్న ప్రకారం జరగవనేది కూడా గమనించదగ్గ అంశంమే.
Recommended Video
నిజాలు బయటకు తీయాలి.. పార్టీల బాగోతాన్ని ప్రజలకు చూపాలి..
ఇలాంటి తరుణంలో కుంభకోణాలు చేసి, అబద్దాలను నిజాలు చేసి, మసిపూసి మారేడుకాయ చేయడం మురికి గుంటలో చేపలు పట్టడమే అంవుతుంది తప్ప మరొకటి కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల అమలు పేరుతో మాజీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడి సుమారు 130కోట్ల రూపాయల నిధులను గోల్ మాల్ చేసారని, అందుకు అచ్చెన్నాయుడును అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని వైసీపి ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. విచారణలో టీడిపి మాజీ మంత్రి తప్పు చేసాడని తేలితే రాజకీయాలకు స్వస్తిపలకాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా అచ్చెన్నాయుడు తప్పు చేయలేదు, జరిగిన కుంభకోణంలో మంత్రి పాత్ర లేదని తేలితే మాత్రం వందకు వంద శాతం జగన్ ప్రతీకార రాజకీయాలకు కాలుదువ్వుతున్నారన్న అంశం నిర్దారణ అవుతుంది.