భువనేశ్వరితో రాజకీయమా ? గాజులు కాదు తీసుకున్న భూములు ఇవ్వాలన్న బొత్సా
రాజధాని ఎర్రబాలెం లో రైతుల దీక్షకు మద్దతు తెలిపిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు రైతుల దీక్షలో చేసిన వ్యాఖ్యలపై, అలాగే చేతిగాజులు తీసి అమరావతి పరిరక్షణా సమితికి ఇచ్చి అండగా ఉంటామని చెప్పిన భువనేశ్వరి టార్గెట్ గా ఏపీ పురపాలక శాఖా మంత్రి బొత్సా సత్యన్నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు .
ఎర్రబాలెంలో రైతుల దీక్షలో గాజు విరాళంగా ఇచ్చిన భువనేశ్వరి
ఎర్రబాలెంలో రైతుల దీక్షకు మద్దతు తెలిపి వారితో పాటు దీక్షకు దిగిన చంద్రబాబు, భువనేశ్వరి ఇద్దరూ రైతులకు భరోసా ఇచ్చారు. అండగా ఉంటామని చెప్పారు. భువనేశ్వరి మాట్లాడుతూ ఇంతమంది మహిళలు రోడ్డుపైకి రావడం తొలిసారి చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు పడుతున్న బాధను తోటి మహిళగా అర్ధం చేసుకున్నానని చెప్పారు. రాష్ట్రం కోసం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడ్డారని చెప్పిన ఆమె చంద్రబాబు ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా ప్రజల కోసం కష్టపడ్డారని పేర్కొన్నారు . చంద్రబాబు మొదటి ప్రాధాన్యత రాష్ట్రమే..ఆ తర్వాతే కుటుంబమని చెప్పారు. అంతేకాదు అమరావతి జేఏసీకి తన చేతి గాజు విరాళంగా ఇచ్చి భరోసా ఇచ్చారు .
భువనేశ్వరితో రాజకీయాలా అంటూ బాబుపై ఫైర్ అయిన బొత్సా
ఎప్పుడూ రాజకీయాల్లో వేలు పెట్టని భువనేశ్వరితో చంద్రబాబు రాజకీయం చేయిస్తున్నారని బొత్సా మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఎవరూ నమ్మటం లేదని, అందుకే సతీమణి భువనేశ్వరి మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాజధాని రైతుల వద్ద భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. రాష్ట్రాన్ని చంద్రబాబు కాపాదలేదని, అప్పులపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల వద్దకు భువనేశ్వరి ఎందుకు వెళ్ళారని నిలదీసిన మంత్రి
అసలు భువనేశ్వరి రైతుల వద్దకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. గాజులు కాదు ఇవ్వాల్సింది రైతుల వద్ద నుండి అక్రమంగా తీసుకున్న భూములు తిరిగి ఇవ్వాలన్నారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారని విమర్శలు గుప్పించిన బొత్సా సత్యన్నారాయణ చంద్రబాబుని చూసి వైఎస్ భయపడ్డారా అని మరోసారి ప్రశ్నించారు. ఎవరిని చూసి ఎవరు భయపడ్డారో అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో నష్టం జరిగిందని, విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా అని నిలదీశారు.