ఘర్షణల నడుమ కొనసాగుతున్న రెండోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ .. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరులో భాగంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో పోలింగ్ కొనసాగుతోంది. అనేక స్వల్ప ఉద్రిక్తతల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు రెండో విడత పోలింగ్ లో కూడా వివిధ జిల్లాలలో టీడీపీ , వైసీపీ , జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
ఎస్ఈసీపై టీడీపీ ఆరోపణలపై సజ్జల ఫైర్.. చంద్రబాబుకు పక్కవాళ్ళ మీద పడి ఏడవటం అలవాటే అంటూ
చిన్న చిన్న ఘర్షణల నడుమ కొనసాగుతున్న పోలింగ్
రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో గ్రామ సర్పంచ్ స్థానాలకు 7507 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామాలలో 33,570 వార్డులు ఉండగా 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్ కొనసాగుతుంది . వార్డులలో 44,876 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే చిన్నచిన్న ఘర్షణలతో రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఘర్షణ , గుంటూరు జిల్లాలోనూ స్వల్ప ఉద్రిక్తతలు
కృష్ణా జిల్లా కొత్త నిమ్మకూరులో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వృద్ధురాలితో కలిసి బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన టిడిపి నేతను వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇక గుంటూరు జిల్లాలోని పలు చోట్ల చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు పంచాయతీ ఎన్నికల్లో వైసిపి , జనసేన పార్టీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఈపురుపాలెం మండలం ఇనిమెళ్ళలో ఘర్షణ .. నరసింగపాడులో నిలిచిన పోలింగ్
ఇక గుంటూరు జిల్లా ఈపురుపాలెం మండలం ఇనిమెళ్ళలో కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఏడవ వార్డు పోలింగ్ బూత్ లో ప్రజల నుంచి ఓటర్ స్లిప్పులు లాక్కుని తానే ఓట్లు వేసేందుకు ఓ ఏజెంట్ ప్రయత్నించగా, మరో ఏజెంట్ దానిని అడ్డగించారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా నకరికల్లు మండలం నరసింగపాడు రెండో వార్డులో బ్యాలెట్ పేపర్ లో గుర్తులు తారుమారు కావడంతో అధికారులు పోలింగ్ నిలిపివేశారు.
ప్రకాశం , విజయనగరం జిల్లాలలో ఘర్షణలు
ఇక ప్రకాశం జిల్లా పొదిలి మండలం దాసర్ల పల్లి గ్రామంలో పోలింగ్ సందర్భంగా రెండు వర్గాల వారు కొట్టుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు .ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక విజయనగరం జిల్లా కొమరాడ మండలం విక్రమ పురంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఏజెంట్ ల మధ్య పెద్ద గొడవ చోటుచేసుకోవడంతో పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు పోలీసులు జోక్యం చేసుకుని గొడవను శాంతింపజేశారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన .. చెదురుమదురు సంఘటనలతో కొనసాగుతున్న పోలింగ్
ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేటలో ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి అంటూ, ఎన్నికలు ఆపాలంటూ గ్రామస్తులు నిరసనకు దిగారు. 2019 ఓటర్ లిస్ట్ ప్రకారం ఎన్నికలు జరపాలని, 196 కొత్త ఓట్లను చేర్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. ఇలా చెదురుమదురు సంఘటనలు మినహా ఏపీ లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.