నంద్యాలలో ముగిసిన పోలింగ్, సాక్షిపై కేసు నమోదు
నంద్యాల: స్వల్ప ఘటనలు మినహ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది సాయంత్రానికి 77.66 శాతం, 82 శాతం పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లలో క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటును నమోదు చేసుకొనే అవకాశం కల్పించినట్టు భన్వర్లాల్ చెప్పారు.
ఎన్నికల విధుల్లో కానిస్టేబుల్ మరణించారు. ఆయనకు పది లక్షలు ఎక్స్గ్రేషియాను ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు.స్థానికేతరులు ఎవరూ కూడ నంద్యాలలో ఎవరూ కూడ నంద్యాలలో లేరని భన్వర్లాల్ ప్రకటించారు.2008లో 76శాతం, 2014లో 71 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఆయన చెప్పారు.
అయితే సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఓటర్లకు ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని అధికారులు కల్పించారు. నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో భారీగా పోలింగ్ నమోదైంది.
నంద్యాలలో భారీగా పోలింగ్ శాతం నమోదు కావడం ఏ పార్టీకి కలిసివచ్చే అవకాశాలున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సాధారణ ఎన్నికల కంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కావడం పట్ల పలువురు ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నారు.
భారీగా పోలింగ్ శాతం నమోదు కావడం తమకే కలిసివస్తోందని టిడిపి,వైసీపీలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సాయంత్రం మూడు గంటలకే సుమారు 70 శాతం పోలింగ్ నమోదైంది. అయితే చివరి మూడు గంటల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనాతో ఉన్నారు అధికారులు.
సాక్షి ఛానెల్పై కేసు నమోదు
సాక్షి ఛానెల్ పై హైదరాబాద్ లోని సీసీఎస్ పోలీసులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ఫిర్యాదు చేశారు. నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో సర్వే పేరిట వార్తలు 'సాక్షి'లో నిన్న ప్రసారం చేశారని ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 'సాక్షి'పై ఎన్నికల చట్టం 126 ఏ, బీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నంద్యాల ప్రచారంలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్ పై ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఐపీసీ 188, 504, 506 సెక్షన్లు, ప్రజాప్రాతినిధ్యచట్టం 125 ప్రకారం నంద్యాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు చేశారు.