కీలక దశకు పోలవరం - మొదలైన గర్డర్ల బిగింపు - ప్రపంచంలో తొలిసారి హైడ్రాలిక్ గేట్లు....
పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన మరో అడుగు పడింది. కరోనా కారణంగా మధ్యలో కాస్త పనులు మందగించినా లాక్ డౌన్ సడలింపులతో తిరిగి వేగం పుంజుకున్నాయి. దీంతో ప్రాజెక్టులో కీలకమైన గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టారు. వర్షాకాలం పూర్తయ్యే లోపు స్పిల్ వే పనులు కూడా పూర్తి చేసి గేట్ల బిగింపు ప్రారంభించేందుకు నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్ సిద్దమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కూడా సహకారం లభిస్తుండటంతో పనులు చురుగ్గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పోలవరం నీటిపై ఏపీ-తెలంగాణ వాటా పోరు -గోదావరి నుంచి కృష్ణాకి మళ్లించే వాటాపై పేచీ..
తిరిగి చురుగ్గా పనులు...
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తలెత్తిన ఇబ్బందులను అధిగమించి పోలవరం ప్రాజెక్టు పనులను తిరిగి గాడిన పెట్టేందుకు నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తిరిగి పోలవరం ప్రాజెక్టు మునుపటి ఊపందుకున్నాయి. ప్రాజెక్టు కీలక దశకు చేరుకోవడంతో పాటు గడ్డర్ల బిగింపు కూడా ప్రారంభమైంది. గేట్ల ఏర్పాటుకు అవసరమైన గడ్డర్లను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రస్తుతం చురుగ్గా సాగుతోంది. సాధ్యమైనంత త్వరగా గడ్డర్ల బిగింపు పూర్తి చేసి హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని నిర్మాణ సంస్ద భావిస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా గేట్ల నిర్మాణంలో హైడ్రాలిక్ పరిజ్ఞానం వాడుతుండటంతో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భారీ గడ్డర్ల ఏర్పాటు...
పోలవరంలో స్పిల్వేకి అవసరమైన గడ్డర్లు, స్పిల్వే పియర్స్ ఏర్పాటు ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ప్రతి జలాశయానీకీ ఇవి ఎంతో కీలకమైనవి. పోలవరానికి గడ్డర్ల అమరిక ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్పిల్వే ను పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించనున్నారు. స్పిల్ వే పెద్దతి అయ్యే కొద్దీ మిగతా నిర్మాణాల పరిమాణం కూడా భారీగా పెరుగుతుంది. దీంతో పోలవరంలో గడ్డర్లు కూడా ప్రపంచంలో ఏ ప్రాజెక్టుకూ లేని విధంగా ఏర్పాటు కానున్నాయి. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 196 గడ్డర్లను బిగించబోతున్నారు.
తొలిసారిగా హైడ్రాలిక్ గేట్లు...
ప్రపంచంలోనే తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్ లో హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా పనిచేసే గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలో ఇంతవరకు ఏ ప్రాజెక్టూ లేని విధంగా పోలవరంలో తొలిసారిగా భారీ హైడ్రాలిక్ గేట్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రపంచంలో ఇలాంటి విధానం చాలా అరుదైనది. గిడ్డర్ల ఏర్పాటు తరువాత హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా పనిచేసే గేట్లను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల వరదలు వచ్చినా రాకపోయినా గేట్ల నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది. మామూలుగా అయితే ఎలక్ట్రో మెకానికల్ గేట్లను ఎత్తడం, దించడం చేస్తారు. మన రాష్ర్టాల్లోని రిజర్వాయర్లన్నింటికి ఇదే పద్ధతి ఉంది. దీనివల్ల నిర్వాహణ వ్యయంతో పాటు తరచూ ఐరన్ రోప్ ను మార్చాల్సి వస్తోంది. పోలవరం ఈ సమస్య ఎదురుకాకుండా హైడ్రాలిక్ గేట్ల వ్యవస్థను మేఘా ఇంజనీరింగ్ ఏర్పాటు చేస్తోంది.
సెప్టెంబర్ కల్లా స్పిల్ వే పూర్తి...
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి స్పిల్ వే పనులు పూర్తి చేయాలని మేఘా ఇంజనీరింగ్ సంస్ద లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అవసరమైన మిగతా పనులను పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు స్పిల్ వే లోని 52 బ్లాక్స్ కు సంబంధించిన పియర్స్ నిర్మాణం పూర్తి కావచ్చింది. బల్లపరుపు నేలపై కాంక్రీట్ వేయటం, రికార్డులు సాధించటం పెద్ద గొప్ప విషయం కాదు. ఇరుకైన పియర్స్ పై కాంక్రిటింగ్, అదీ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ నియమనిబంధనలకు అనుగుణంగా చేయటం అనేది అత్యంత క్లిష్టమైంది. అంతటి క్లిష్టమైన పనిని కూడా మేఘా సునాయాసంగా పూర్తిచేస్తోంది. స్పిల్ వే మొత్తం దూరం 1.2 కిలో మీటర్లు. ఇది ప్రపంచంలోనే పెద్దది. ఇంతవరకూ చైనాలోని త్రీ గార్జెస్ డ్యాంలో 47 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తే ఇక్కడ 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తున్నారు. స్పిల్వే కు గేట్ల నిర్వహణ ముఖ్యం. వీటిపై గడ్డర్ల అమరిక కూడా పూర్తయితే చాలా వారకూ స్పిల్ వే పనులు పూర్తయినట్లే. ఆ తర్వాత గేట్ల బిగింపు కార్యక్రమం మొదలు కానుంది. ఈ లెక్కన అక్టోబర్ నుంచి గేట్ల బిగింపు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.