పాలిటెక్నిక్ విద్యార్ధిపై 'మహిళా సైకో' దాడి: మరో ఊహాచిత్రం విడుదల
సామర్లకోట: ఉభయగోదావరి జిల్లా పోలీసులకు 'సిరంజి సైకోలు' కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిన్నటి వరకు 'సూది' గాడి కోసం రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని సైకో కోసం గాలిస్తున్న రెండు జిల్లాల పోలీసులకు తాజాగా ఒక మహిళ యువకుడిపై దాడి చేసినట్లు సమాచారం అందింది.
నిన్నటి వరకు ఈ సూది దాడులు కేవలం పశ్చిమ గోదావరికి మాత్రమే పరిమితమయ్యాయి. తాజా ఘటనతో తూర్పుగోదావరి జిల్లాలోనూ ఈ సిరంజి దాడులు మొదలయ్యాయి. సామర్లకోట పట్టణంలో బుధవారం రాత్రి 8 గంటలకు సంగీతరావు పేటకు చెందిన దుర్గాప్రసాద్(25) వద్దకు ఒక మోటార్సైకిల్పై ఒక పురుషుడు, స్త్రీ వచ్చి పిఠాపురం వెళ్లే దారి చెప్పాలని అడిగారు.
అతడు సమాధానం చెప్పేలోగానే వెనుక ఉన్న మహిళ సిరంజితో అతడి చేతిపై దాడిచేసింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వారిద్దరూ మోటార్ సైకిల్పై పరారయ్యారు. బాధితుడు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహిళ పసుపు రంగు చీర ధరించిదని, పురుషుడు నలుపు కళ్లజోడుతో ఉన్నాడని బాధితుడు తెలిపాడు.
ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పశ్చిమగోదావరిజిల్లాలో సైకో దాడిలో గాయపడిన మహిళ మళ్లీ అస్వస్థతకు గురవడంతో ఆమెను భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. దీంతో బాధితుడి నుంచి సమాచారం సేకరించిన పోలీసులు సైకో జంటకు సంబంధించిన ఊహాచిత్రాలను విడుదల చేశారు. తాజా దాడితో సైకో దాడికి గురైన బాధితుల సంఖ్య 20కి చేరింది.