ముద్దుపెడ్తే: జగన్పై పొంగులేటి, కిరణ్కి పిచ్చి: శంకర్రావ్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి గురువారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్రమాస్తుల అసోసియేషన్ అధ్యక్షుడు వైయస్ జగన్ అని మండిపడ్డారు. తెలంగాణలో అక్రమాస్తుల బ్రాంచీలు తెరిచేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
జగన్ లాగే ఖమ్మం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి కూడా అవినీతి చరిత్ర ఉందన్నారు. కోట్లలో డీల్ కుదిరిన వారికే జగన్ సీట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజలు, చిన్న పిల్లల తలల పైన ముద్దులు పెడితే తెలంగాణ బిడ్డవు కాలేవని పొంగులేటి ఎద్దేవా చేశారు. తెలంగాణలో పర్యటించే హక్కు జగన్కు లేదన్నారు.
పిచ్చెక్కి పార్టీ: శంకర రావు
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిచ్చెక్కి పార్టీ పెడుతున్నారని మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యులు శంకర రావు అన్నారు. కిరణ్ పార్టీలో మిగిలేది ఆయన ఒక్కడే అన్నారు. విభజన పాపం కాంగ్రెసు పార్టీదే అంటూ మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీనీ వీడటం విడ్డూరమన్నారు. విభజనకు సహకరించిన బిజెపిలో ఆమె ఎలా చేరుతారని ప్రశ్నించారు.
అవకాశం లేకనే: జెసి దివాకర్ రెడ్డి
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలోకి వెళ్లే అవకాశం లేని వారే కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతామని చెబుతున్నారని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు నేత జెసి దివాకర్ రెడ్డి అన్నారు. కాగా, జెసి సోదరులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.