సిక్కోలు, విజయనగరంపై ఫొణి ఎఫెక్ట్ : ఈదురుగాలులు, వర్షం, నిలిచిన విద్యుత్ సరఫరా, గ్రామాల్లో అంధకారం
అమరావతి : సూపర్ సైక్లోన్ గా మారిన ఫొణి సిక్కోలును వణికిస్తోంది. గురువారం సాయంత్రం నుంచే జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే సహాయక, పునరావాస చర్యలను అధికారులు చేపట్టారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 126 సహాయక కేంద్రాలను ఏర్పాటుచేసి ... ఆహారం అందుబాటులో ఉంచారు. ఇటు విజయనగరం జిల్లాలో ఫొణి తుఫాన్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ప్రచండ గాలులతో సముద్రం భయానకంగా మారింది. కొన్నిచోట్ల ఈదరుగాలులతో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారం నెలకొంది.
20 వేల మందికి సాయం
24 గంటల్లో 20 వేల మందికి సహాయక చర్యలు అందించినట్టు అధికారులు చెప్తున్నారు. 23 మండలాల్లో గాలులు, వర్షం ప్రభావం స్పష్టంగా ఉండటంతో .. రాత్రి తుఫాను బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు.
వర్ష బీభత్సం ..
ఇప్పటికే ఒడిశాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తోన్న వర్షాలతో బహుదా నది, వంశధార నదులకు రేపట్నుంచి భారీగా వరదనీరు పోటెత్తే అవకాశం ఉంది. దానికనుగుణంగా బ్యారేజీలన్నింటి వద్ద గేట్లు ఎత్తివేశారు. ఈ రాత్రికి వరద ప్రభావం ఎక్కువగా కనబడే అవకాశం ఉంది.
రాకపోకల నిషేధం ..
ఇదివరకు తుఫాను సమయంలో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రిస్తారు. తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్రామాల్లో అంధకారం
ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగడంతో ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, వీరఘట్టం, కొత్తూరు, హిరమండలం, పొందూరు, బూర్జ, ఎల్.ఎన్.పేట, రాజాం, గార, సరుబుజ్జిలి, జలుమూరు, టెక్కలి, భామిని, సీతంపేట, ఆమదాలవలస తదితర మండలాల్లో భారీ వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.