మీరంటే మీరు: తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు వీధికి
హైదరాబాద్: తెలంగాణ ఇచ్చినప్పటికీ... కాంగ్రెసు పార్టీ పూర్ షో పైన తెలంగాణ ప్రాంత నేతలు ఒకరి పైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మీ వల్లే అంటే మీ వల్లే అంటూ రోడ్డెక్కుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా ఈ ప్రాంతంలో పార్టీ ఘోర పరాజయం పొందడానికి అధిష్ఠానం తీరే కారణమని టి కాంగ్రెస్ ముఖ్యనేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విభజన నిర్ణయాన్ని తీసుకున్నాక కూడా సకాలంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని (టిపిసిసి) వేయకపోవడం, అందరిని కలుపుకుని వెళ్లే స్థాయి కలిగిన నేతను అధ్యక్షుడిగా నియమించకపోవడం, ముఖ్యనేతలందరికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ సమష్టి బాధ్యతలు అప్పగించకపోవడం వంటివి దెబ్బతీశాయంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రెండు పిసిసిలు ఏర్పాటు చేయాలంటూ దిగ్విజయ్ సింగ్, సోనియా గాంధీ , రాహుల్ గాంధీలను పదేపదే కోరినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు అధ్యక్షుడిగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్యను వేశారని చెబుతున్నారు. తెలంగాణలో దశాబ్దాలుగా కాంగ్రెస్లో కీలక పాత్ర పోషిస్తోన్న రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టామన్న సంకేతాలను పంపడాన్ని ఆ వర్గం జీర్ణించుకోలేకపోయిందంటున్నారు.
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఏకంగా అధిష్ఠానం పెద్దల వద్దే తన అసంతృప్తిని వెళ్లగక్కారట. అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడంపైనా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో తెరాసను విలీనం చేయక పోవడంతోపాటు పొత్తులకు కూడా కెసిఆర్ విముఖత వ్యక్తం చేయడంపై తీవ్ర అసహనం కనబరిచారు. అయితే దిగ్విజయ్ సింగ్ మాత్రం తెరాసతో పొత్తులకు ఇంకా తలుపులు తెరచే ఉన్నాయంటూ పదేపదే చెప్పడం నష్టం కలిగించిందంటున్నారు.
పైగా పొన్నాలకు పిసిసి అధ్యక్ష పీఠాన్ని అప్పగించినా .. సీనియర్ నేతలైన జానారెడ్డి, డి శ్రీనివాస్ వంటి వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఆ పని జరగకపోవడంతో వారంతా ఎవరికి వారే అన్నట్లుగా దూరంగా ఉండిపోయారన్నారు. కెసిఆర్ రైతులు, మహిళలు, యువకులు.. ఇలా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా పథకాలు ప్రవేశ పెడతామని వివరించారంటున్నారు. దళిత ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి వంటి ప్రకటనలు టీ కాంగ్రెస్ నేతల్లో విభేదాలు మరింత పెరిగేలా చేశాయంటున్నారు.
తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది తామేనని ప్రజలకు చెప్పలేకపోవడం వల్లనే ఓటమి చెందామని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పార్టీ వైఫల్యానికి ఒకరినే బాధ్యులను చేయవద్దని ఆయన హితవు పలికారు. సార్వత్రిక ఫలితాలపై జైపాల్ రెడ్డి నివాసంలో శనివారం నేతలు సమావేశమై సమీక్షించారు. ఈ సమావేశానికి పొన్నాల, గుత్తా సుఖేందర్ రెడ్డి, జానా రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అధిష్టానం నిర్ణయ లోపమే తమ కొంప ముంచిందని వారు అభిప్రాయపడ్డట్లుగా సమాచారం.