కేసీఆర్పై పొన్నాల ధ్వజం, స్వేచ్ఛ ఎక్కువ, ద్రోహం చేస్తే..
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య శనివారం ఆరోపించారు. స్థానికత, రుణమాఫీ, పీజు రీయింబర్స్మెంట్వంటి వాటిపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ఎంతసేపూ ఇతరపార్టీల నుంచి నాయకులను తమ పార్టీలోకి లాగేసుకునే వ్యూహాలే తప్ప అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టడం లేదన్నారు. గాంధీభవన్లో మెదక్ జిల్లా పార్టీ సమీక్షా సమావేశం అనంతరం పొన్నాల విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యమాలు చేసేందుకు కార్యాచరణకు రూపకల్పన చేస్తామన్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఏమాత్రం నైరాశ్యం లేదని గత కొన్నిరోజులుగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల ద్వారా స్పష్టమైందన్నారు. నాయకులకే కార్యకర్తలు భరోసా ఇచ్చేలా సమీక్షా సమావేశాల్లో వారి నుంచి సూచనలు వస్తున్నాయన్నారు.
గెలుపోటములు కాంగ్రెస్కు కొత్తేమీ కాదన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని క్షమించరాదని కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందని, వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా తెలంగాణ ఇస్తే.. తెరాస ప్రభుత్వం వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయడం లేదన్నారు.
పార్టీలో తన పై చేస్తున్న విమర్శలపై...
పార్టీలోని కొందరు నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలపై పొన్నాల స్పందించారు. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ అని, ఎవరిపై ఎప్పుడు ఏం చర్య తీసుకోవాలో తమకు తెలుసన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యకర్తల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, వారిలో ఉన్న మరోధైర్యం, పట్టుదల పార్టీని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపేందుకు తోడ్పడతాయన్నారు.