పొన్నాల లక్ష్మయ్య: ఐటి కంపెనీలకు మిత్రుడు
హైదరాబాద్: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను అనూహ్యంగా తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి వరించింది. ఆయన చాలా కాలంగానే ముఖ్యమంత్రి పదవి కోసం, పిసిసి పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ చివరకు టిపిసిసి అధ్యక్ష పదవి దక్కింది. సీనియర్ రాజకీయ నాయకుడైన పొన్నాల లక్ష్మయ్యకు టెక్నికల్, అకడమిక్ నేపథ్యం ఉంది. చదువు ముఖం చూడని కుటుంబం నుంచి పొన్నాల లక్ష్మయ్య వచ్చారు.
ఆయన వరంగల్ జిల్లా జనగామలో 1944 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. కుటుంబంలో ఉన్నత విద్యను అభ్యసించిన మొదటి వ్యక్తి పొన్నాల. అమెరికాలో ఆయన మెకానికల్ ఇంజనీరింగులో ఎంఎస్ చేసారు.
డెబ్బయ్యవ దశకం చివరి నుంచి పొన్నాల లక్ష్మయ్య రాజకీయాల్లో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన ఐటి శాఖను నిర్వహించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల శాఖను నిర్వహించారు. నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1978 నుంచి కాంగ్రెసు కోసం పనిచేస్తూ వస్తున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెసు కమిటీలో ఆయన కీలక పదవులు నిర్వహించారు. ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద ఆయన మంత్రిగా పనిచేశారు.
మత్స్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 50 లక్షల మంది జాలర్లలో విశేషమైన మార్పు తెచ్చారు. వ్యవస్థలను ఆధునీకరించి, జాలర్ల కుటుంబాలకు మార్కెటింగ్, చేపల ఉత్పత్తుల్లో మెలుకువలను అందించారు. తన స్వస్థలం జనగామ ప్రాంతంలో ఆయన డెయిరీని, పౌల్ట్రీని ప్రోత్సహించారు. ఐటి, కమ్యూనికేషన్ల మంత్రిగా ఐటి కంపెనీలను ప్రోత్సహించి, వాటికి మిత్రుడిగా మారిపోయారు.