రసమయి వస్తారని పొన్నం, కెసిఆర్పై దామోదర ఫైర్
హైదరాబాద్/కరీంనగర్: ప్రముఖ కళాకారుడు రసమయి బాలకిషన్ ఈ నెల 19వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఆదివారం అన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేత మల్లేపల్లి లక్ష్మయ్య కూడా కాంగ్రెస్లో చేరనున్నారని తెలిపారు.
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని నరరూప రాక్షసుడు అని గతంలో చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు బిజెపితో దోస్తీ కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారన్నారు. పొత్తులపై అధిష్టానందే తుది నిర్ణయమన్నారు.
కాగా, తాను కాంగ్రెసు పార్టీలో చేరడం లేదని రసమయి బాలకిషన్ వివరణ ఇచ్చారని సమాచారం. తనకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం టిక్కెట్ కేటాయించిన తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కృతజ్ఞతలు అన్నారు.
కెసిఆర్పై దామోదర, షబ్బీర్ నిప్పులు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ కాంగ్రెసు నేతలు దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీలు నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చి సోనియా మాట నిలబెట్టుకున్నారన్నారు. ఓ ప్రాంతంలో తమ పార్టీ నష్టపోయినా పట్టించుకోలేదన్నారు. తెరాస తీరు ఏరు దాటే ముందు ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉందన్నారు. జిమ్మిక్స్, మైండ్ గేమ్ ద్వారా తమ పార్టీని దెబ్బతీయాలని కెసిఆర్ చూస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.
తెరాసతో తమకు పొత్తు అవసరం లేదన్నారు. విలీనం, పొత్తులు, దళిత ముఖ్యమంత్రి అని కెసిఆర్ మాట తప్పారన్నారు. మాట నిలబెట్టుకున్న కాంగ్రెసు పార్టీనే ప్రజలు ఆదరిస్తారన్నారు. దగా, మోసానికి పర్యాయపదం కెసిఆర్ ధని ధ్వజమెత్తారు. త్వరలో తెలంగాణలో భారీ సభను ఏర్పాటు చేసి, సోనియాను ఆహ్వానిస్తామన్నారు. కాంగ్రెసు పార్టీ తనను పిలిచి తెలంగాణ విషయం మాట్లాడలేదని కెసిఆర్ నిజం చెప్పారని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. విలీనంపై ఆయన మాట నిలబెట్టుకోలేదన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెసు తెలంగాణ ఇవ్వలేదన్నారు.