30 లక్షల పేదలకు పట్టాల పంపిణీ, 15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం: మంత్రి బొత్స
పేదలకు ఇళ్ల పట్టాలు రేపు (శుక్రవారం) పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చెప్పినట్టే పేదలకు ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పారు. తమది చేతల ప్రభుత్వం అని మరోసారి స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని.. పేదల సంక్షేమమే తమకు ప్రయారిటీ అని తేల్చిచెప్పారు. ఇందులో సందేహానికి తావులేదని తెలియజేశారు.
పేద ప్రజల సొంతింటి కల శుక్రవారం నెరవేరబోతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు. 15 లక్షల ఇళ్ల పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ పాల్గొంటారని బొత్స సత్యనారాయణ తెలియజేశారు. మిగతా చోట్ల మంత్రులు హాజరవుతారని వివరించారు.
2.62 లక్షల మందికి టిడ్కో ఇళ్లు ఇస్తామని ఆయన తెలిపారు. కొత్త లేఔట్లతో 17 వేల కొత్త గ్రామాలు రూపొందాయని చెప్పారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కోటరీ మాత్రం కోర్టులకు వెళ్లడం వల్ల ఆలస్యమైందని తెలిపారు. 23 వేల కోట్ల విలువైన భూములను పంపిణీ చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ పట్టణంలోనే 1350 కోట్ల విలువైన 4457 ఎకరాలు పంపిణీ చేస్తామని వివరించారు. మిగతా చోట్ల కూడా విలువైన భూములను సేకరించామని పేర్కొన్నారు.