ఏపీలో పథకాలు చూస్తే.. దేశంలోని పేదలు జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను చూస్తే... దేశంలోని పేదలు జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారంటూ ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతుండటం పట్ల దేశమంతా రాష్ట్రం వైపే చూస్తోందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతోందని పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడారు.
దేశంలోని పేదలు జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారని పార్థసారథి వ్యాఖ్యానించిన సమయంలో సీఎం జగన్ అదే వేదికపై ఉన్నారు. పార్థసారథి వ్యాఖ్యలకు వాలంటీర్ల నుంచి హర్షాతికేరాలు వ్యక్తమయ్యాయి. ఆ వ్యాఖ్యలకు సీఎం జగన్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.
ఈ సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ... ఏపీ వాలంటీర్ వ్యవస్థ ఖ్యాతి జాతీయస్థాయికి చేరిందన్నారు. ప్రధాని మోదీ కూడా వాలంటీర్ వ్యవస్థను అభినందించారని తెలిపారు.రాష్ట్రాన్ని బంగారు భవిత దిశగా సీఎం జగన్ నడిపిస్తున్నారని అన్నారు. ఇదే సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... రాష్ట్రంలో 2 లక్షల 50 వేల పైచిలుకు వాలంటీర్లను చూసి చంద్రబాబు కుళ్లుకుంటున్నారని విమర్శించారు.
కాగా,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాలు,ఇతరత్రా సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.అత్యుత్తమ సేవలు కనబరిచిన గ్రామ, వార్డు వాలంటీర్లకు సత్కారం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.261 కోట్ల నిధులు విడుదల చేసింది. సేవావజ్ర-30వేలు, సేవారత్న-20వేలు, సేవామిత్ర-10వేలు.. ఇలా మూడు కేటగిరీల్లో వాలంటీర్లకు నగదు ప్రోత్సాహాకాలు అందించాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో వాలంటీర్లకు సన్మాన,సత్కార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం(ఏప్రిల్ 12) కృష్ణా జిల్లా పోరంకిలో ప్రారంభించారు. వాలంటీర్ వ్యవస్థ వల్లే సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు చేరుతున్నాయని సీఎం జగన్ అన్నారు. వాలంటీర్లు నిస్వార్ధంగా పనిచేస్తున్నారని.. ఎక్కడా వివక్షకు తావులేకుండా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారని చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 60 వేల మంది వాలంటీర్లు ఉంటే ఇందులో 50శాతం మహిళలు ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఇక నుంచి ప్రతీ ఏడాది వాలంటీర్లకు ప్రభుత్వం సత్కారం చేస్తుందని.. ప్రతీ ఏటా వాలంటీర్లు మెరుగైన పనితీరు కనబరచాలని హితవు పలికారు.