ఫలించని మినహాయింపులు- తెలుగు రాష్ట్రాల్లో ప్రజా రవాణాకు స్పందన కరవు
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ ప్రభావం ప్రజా రవాణాపై తీవ్రంగా పడింది. దాదాపు రెండున్నర నెలల పాటు కదలని బస్సులు, రైళ్లు తిరిగి ప్రారంభం కాగానే వాటికి విపరీతమైన స్పందన లభిస్తుందని భావించినా ఆ పరిస్ధితి కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజా రవాణాకు పేలవ స్పందన తప్పడం లేదని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
హైదరాబాద్లో కరోనా వైరస్ విస్పోటనం.. పెరిగిన మరణాలు.. తెలంగాణలో తాజా లెక్కలివి..
ప్రజా రవాణాకు స్పందన కరవు...
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో బస్సులు, రైళ్ల ప్రయాణాలు ప్రారంభమై వారం రోజులు దాటింది. అయినా ఇంకా చాలా చోట్ల బస్సులు, రైళ్లు ఖాళీ సీట్లతోనే ప్రయాణాలు సాగించాల్సిన పరిస్ధితులు ఉంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించే పల్లెవెలుగు బస్సుల పరిస్ధితి మరీ దారుణంగా ఉంటోంది. అటు రైళ్ల పరిస్ధితి అంతంత మాత్రమే. కేవలం దూరప్రాంతాలకు వెళ్లే రైళ్ల పరిస్ధితి మాత్రమే కాస్త మెరుగ్గా ఉంటోందని అధికారులు చెప్తున్నారు.
ఖాళీ సీట్లతో నష్టాలే....
జనంతో కిటకిటలాడాల్సిన బస్సులు, రైళ్లు ప్రస్తుతం ఖాళీ సీట్లతో దర్శనమిస్తున్నాయి. చాలా చోట్ల రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు కూడా చివరి నిమిషంలో వెనక్కి తగ్గుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. ఎప్పుడూ రద్దీగా దర్శనమిచ్చే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే పలు రైళ్లలో ఇప్పుడు రిజర్వేషన్ సీట్లు కూడా పూర్తిగా నిండని పరిస్ధితి నెలకొంది. దీంతో అధికారులే నివ్వెరపోతున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే ప్రజారవాణా పునరుద్ధరణ వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా నష్టాలు మూటగట్టుకోవాల్సి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా భయాలు- ఆంక్షలు...
కరోనా వైరస్ కారణంగా నెలకొన్న భయాలతో చాలా చోట్ల ప్రజలు బస్సులు, రైళ్లలో ప్రయాణాలకు మొగ్గు చూపడం లేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణాలు సాగించే పల్లెవెలుగు సర్వీసుల్లో ఎక్కేందుకు ప్రజలు అస్సలు ఇష్టపడటం లేదు. గ్రామీణ ప్రజల్లో నెలకొన్న కరోనా వైరస్ భయాలే ఇందుకు కారణం. అలాగే రైళ్లలోనూ ప్రయాణాలకు జనం ముందుకు రావడం లేదు. మరీ తప్పనిసరి అయితే తప్ప రైలు ప్రయాణాలకు మొగ్గు చూపడం లేదు. రైల్వే స్టేషన్లలో ప్రయాణాల కోసం ముందుగా చేరుకోవడంతో పాటు ఇతర ఆంక్షలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వాల దృష్టి...
కరోనా భయాలతో ప్రయాణికులు ప్రజా రవాణాకు మొగ్గు చూపకపోవడంతో ప్రభుత్వాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాయి. ఇందులో భాగంగా అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు బస్సులను ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మేరకు అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు ప్రారంభమైతే వీటికి ఆదరణ బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. లోకల్ సర్వీసులతో పోలిస్తే దూరప్రాంత, అంతర్ రాష్ట్ర సర్వీసులకు ఆదరణ ఉండొచ్చని భావిస్తున్నారు.