'చిరంజీవి చాలా మంచోడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను'
హైదరాబాద్: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పైన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి చాలా మంచివాడని చెప్పిన పోసాని.. పవన్ కళ్యాణ్ గురించి మాత్రం మాట్లాడేందుకు నిరాకరించారు.
తాను 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి పిలిచి, టిక్కెట్ ఇచ్చాడనే ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశానని చెప్పారు. చిరంజీవి మళ్లీ ప్రజారాజ్యం పార్టీ ద్వారా పోటీ చేయమని ఆదేశిస్తే తాను సిద్ధమన్నారు. తనకు చిరంజీవి అంటే చాలా అభిమానం అన్నారు.
పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి ప్రశ్నించగా.. ఆయన గురించి తాను మాట్లాడనని చెప్పారు. తాను మంచి, చెడు రెండు విషయాల గురించే మాట్లాడుతానని అన్నారు. ఓ వ్యక్తి గురించి తాను మాట్లాడాలంటే మంచివాడైనా అయి ఉండాలి లేదా చెడ్డవాడైనా అయి ఉండాలన్నారు. పవన్ పార్టీ తరఫున పోటీ చేస్తారా అంటే లేదని చెప్పారు. జనసేన గురించి తనకు తెలియదన్నారు.