జగన్ గెలుపుకు మొక్కులు తీర్చుకున్న పోసాని..! ప్రజా రాజ్యం విలీనం చేయడం జీర్ణించుకోలేక పోయా..!!
అమరావతి/హైదరాబాద్: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నానని సినీ నటుడు పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. ఆయన కోరిక నెరవేరడంతో అమీర్పేట, బేగంపేట, ఫిలింనగర్లోని ఆలయాల్లో దేవుళ్లకు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి పలు ఆసక్తికర అంశాలు వెళ్లడించారు.
జననేతపై అభిమానాన్ని చాటుకున్న పోసాని..! జగన్ సీఎం కావడం సంతోషంగా ఉందన్న నటుడు..!!
చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావాలని గతంలోనూ దేవుడిని కోరి మొక్కులు తీర్చుకున్నానని పోసాని తెలిపారు. కష్టాల నుంచి పైకొచ్చిన తాను ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా ఉన్నానని అన్నారు. జగన్ సీఎం కావాలన్నదే తన చివరి కోరికని, ఆ కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని, ప్రజాతీర్పు చూసి చంద్రబాబులో మార్పు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. జగన్ జన రంజక పాలన చేసి మంచి పేరు తెచ్చుకుని మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. జగన్ మంచి వ్యక్తి కాబట్టి ఆయనకు నిస్వార్ధంగా మద్దతు తెలిపానని, ఆయనకంటే సమర్ధుడు మరొకరు వస్తే ఆయనకూ మద్దతిస్తానని పోసాని తెలిపారు.
చంద్రబాబు మారిపోయారు..! అందుకే ప్రజాధరణ పోయిందన్న పోసాని..!!
గతంలో తాను చంద్రబాబుకు మద్దతిచ్చానని, తర్వాత ఆయన పాలన నచ్చకే విమర్శించానని పోసాని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు మద్దతివ్వడం వల్లే పవన్కు ఓటమి ఎదురైందని అన్నారు. పవన్ మొదటి నుంచి ఒంటరిగా పోరాడి ఉంటే ప్రజల మద్దతు ఉండేదని, రాజకీయాల్లో నిజాయతీ ఉంటే సరిపోతుందని తెలిపారు. తెలంగాణలో వెలువడ్డ ఫలితాలు సరైనవనే అభిప్రాయాన్ని పోసాని వ్యక్తం చేసారు.
జగన్ కు జన నీరాజనం..!ఇది మార్పుకు నిదర్శనమన్న కృష్ణమురళి...!!
వైఎస్ జగన్కు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యావత్తు భారీ మద్దతు పలికారు. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాల్లో ఘనవిజయం సాధించింది. మొదటి నుంచీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభిమానాన్ని చాటుకునే దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి వైఎస్సార్సీపీ అఖండ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.
ప్రజారాజ్యం విలీనాన్ని తట్టకోలేక పోయా..!పవన్ పార్టీని నడుపుతాడన్న నమ్మకం ఉందన్న పోసాని..!!
ఇక మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పై పోసాని కృష్ణమురళి స్పందించారు. ప్రజా రాజ్యం పార్టీ మంచి ప్రజాధరణ పొందిందని, నిబద్దతతో నడిపించాల్సిన సమయంలో పార్టీ పక్క దారి పట్టిందని ఆవేదన వ్యక్తం చేసారు. చిరంజీవి ప్రజాసేవ చేయాలని సత్ సంకల్పంతో పార్టీని స్థాపించినప్పటికి పూర్తి స్థాయిలో పట్టాలెక్కించలేక పోయారని తెలిపారు. పార్టీని చివరకు కాంగ్రెస్ లో విలీనం చేయడం కూడా తనకు జీర్ణించుకోలేని అంశంగా తయారయ్యిందని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పార్టీని పూర్తి స్థాయిలో నడిపిస్తారనే విశ్వాసం తనకు ఉందని పోసాని కృష్ణమురళి తెలిపారు.