చెప్పుతో కొడతారు: వర్మకు పోసాని హెచ్చరిక, లక్ష్మీపార్వతి 'బాలకృష్ణ' వ్యాఖ్యపై నో
స్వర్గీయ నందమూరి తారక రామారావుపై బయోపిక్ తీస్తానన్న వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మకు ప్రముఖ రచయిత, నటుడు పోసాని మురళీ కృష్ణ ఓ సూచన చేశారు. ఆయన ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
అమరావతి: స్వర్గీయ నందమూరి తారక రామారావుపై బయోపిక్ తీస్తానన్న వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మకు ప్రముఖ రచయిత, నటుడు పోసాని మురళీ కృష్ణ ఓ సూచన చేశారు. ఆయన ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడే ఎందుకు: విలన్ చంద్రబాబా, లక్ష్మీపార్వతా?
ఎన్టీఆర్ జీవిత చరిత్రను తీస్తే అందరి అభిప్రాయాలు తీసుకోవాలని, వ్యక్తిగత జీవితం ముట్టుకోకుండా సినిమా తీయలేరని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను బాధపెట్టడం ఎందుకని ప్రశ్నించారు. దీనికంటే బయోపిక్ తీయకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.
లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై నో కామెంట్
ఎన్టీఆర్ జీవిత చరిత్ర మొత్తం వర్మకు తెలుసని పోసాని చెప్పారు. ఎన్టీఆర్పై నిర్మించనున్న బయోపిక్లో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తే ఆ సినిమాకు న్యాయం జరగదన్న లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై తాను స్పందించనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆమె అంటే తనకు గౌరవమని, అక్కలాంటి వారన్నారు. ఆమె తన బాధలో నుంచి ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని అన్నారు. ఎన్టీఆర్పై బయోపిక్ తీయకపోవడమే మంచిదని తాను వర్మకు చెబుతున్నానని అన్నారు.
తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొడతారు
ఎన్టీఆర్ గురించి తాను తప్పుగా మాట్లాడితే తనను చెప్పుతో కొడతారని, అసలు ఆయన గురించి తప్పుగా మాట్లాడే అంశాలు ఆయన జీవితంలో లేవని, ఈ విషయమై తాను ఎవ్వరితోనైనా మాట్లాడగలనని పోసాని అన్నారు. అయితే ఈ విషయమై వర్మతో మాత్రం నేను చచ్చినా మాట్లాడనని అన్నారు. ఆయన అంటే తనకు గౌరవం ఉందన్నారు. వర్మను సినిమా తీయద్దని చెప్పే హక్కు తనకు లేదన్నారు. తనకు ఎన్టీఆర్ ఎవరెస్ట్ ఇన్ ఇండియా అన్నారు. బయోపిక్ వద్దని తాను రిక్వెస్ట్ మాత్రమే చేయగలనని చెప్పారు.
రాళ్లు, వెంటపడి కొడతారని హెచ్చరిక
ఎన్టీఆర్ జీవిత కథ పేరుతో ఆయనను అవమానపరుస్తూ సినిమా తీస్తే థియేటర్లో ప్రేక్షకులు రాళ్లు వేస్తారని పోసాని హెచ్చరించారు. రామారావును అవమానపరుస్తూ బయోపిక్ తీస్తే, స్క్రీన్ ని చించేస్తారని, వెంటపడికొడతారన్నారు. ఆయనకు అవమానం జరిగినా, తక్కువ చేసి మాట్లాడినా ఎవరూ ఊరుకోరన్నారు.
పెద్ద లీడర్లు తెలియక..
ఎంత పెద్ద నేతలు అయినా తమకు తెలియకుండా కొన్ని పొరపాట్లు కూడా చేస్తారని పోసాని అన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డి, నరేంద్ర మోడీలు పెద్ద లీడర్లు అని, వారు కూడా తెలియకుండా పొరపాటు చేసి ఉంటారన్నారు. నేను కూడా ఎన్నో చేశానని పోసాని అన్నారు. అలాంటప్పుడు ఓ గొప్ప నేతకు సంబంధించిన అంశాలను ముట్టుకోవద్దన్నారు.
రామారావుపై ఈ ఆరోపణలు, ఆధారాలుంటే చెప్పాలి
ఎన్టీఆర్ పదవిని అడ్డుపెట్టుకుని కొడుకులకు దోచిపెట్టారు, భూ కబ్జా చేశారు, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, కుటుంబాన్ని ప్రేమించలేదు, సినిమా రంగంలో మోసం చేశారు వంటి అంశాలకు ఆధారం ఉంటే చెప్పాలని పోసాని నిలదీశారు. ఈ విషయాల్లో ఎన్టీఆర్ మచ్చలేని వ్యక్తి. బసవతారకం చనిపోయే వరకు ఆమెను దేవతలా ప్రేమించారని పోసాని అన్నారు. ఆమె కేన్సర్ వ్యాధితో మరణిస్తే చిన్నపిల్లాడిలా విలపించారన్నారు. ఆయన జీవితంలో ప్రతి అంశం నిజాయతీతో కూడుకున్నదే అన్నారు. ప్రజల కోసం వచ్చిన ఎన్టీఆర్ జీవితంలో అవినీతి లేదని, ఆయన సినీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలోనూ ఎవ్వరికీ అన్యాయం చేయలేదన్నారు.
లక్ష్మీపార్వతినీ మోసం చేయలేదు, తెలుగుజాతి బాధపడుతుంది
లక్ష్మీపార్వతిని కూడా ఎన్టీఆర్ మోసం చేయలేదని పోసాని అన్నారు. నిజాయతీగా నిలబడి ఆమెతో చివరిదాకా ఉన్నారని చెప్పారు. ఇంకా, ఎన్టీఆర్ జీవితంలో నెగెటివ్ ఏముంది? ఏమీ లేదన్నారు. తానేమీ, ఎన్టీఆర్ తరపున వకాల్తా పుచ్చుకోవడం లేదన్నారు. ఆయనను కాకాపట్టి పదవి తీసుకునేందుకు ఆయన బతికి లేరన్నారు. ఎన్టీఆర్ ఓ లెజెండ్ అని, అలాంటి వ్యక్తిని అలా వదిలేయాలన్నారు. ఇప్పటి దాకా జీవిత కథలు తీసినవి అన్నీ కాంట్రోవర్సీ అయ్యాయని, ఇప్పుడు ఎన్టీఆర్ జీవిత కథ అలా తీస్తే తెలుగు ప్రపంచం మొత్తం బాధపడుతుందని అన్నారు.