పండగ సెలవుల నుంచి పని బాట...అంతా ఒకేసారి రాక:ఎటు చూసినా జనంతో కిటకిట...ప్రయాణ కష్టాలు
విజయవాడ/హైదరాబాద్:బస్టాండ్ లు,రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు ఏవి చూసినా...రద్దీ...విపరీతమైన రద్దీ...ఎటు చూసినా జనం...రోడ్ల మీద చూస్తే కనుచూపుమేరా బారులు తీరిన వాహనాల ప్రవాహాలే.
ఇవీ ఇప్పుడు భారతదేశంలో దాదాపుగా ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలు. హిందువుల అతిముఖ్యమైన పండుగల్లో ఒకటైన దసరా కు లభించే ప్రత్యేక సెలవుల సందర్భంగా కుటుంబాలతో సహా స్వస్థలాలకు విచ్చేసి...ఆ సెలవులు ముగిసాక తమ తమ ఆవాసాలకు తిరుగుముఖం పట్టిన ప్రయాణికులే వీళ్లంతా. ఈ క్రమంలో అంతా ఒకే సారి బయలుదేరిన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఎదుర్కొంటున్న అవస్థలపై ప్రత్యేక కథనం.
ఒకేసారి తిరుగుముఖం...విపరీతమైన రద్దీ
సోమవారం నుంచి ఆఫీసులు, విద్యాసంస్థలు పునఃప్రారంభం అవుతుండటంతో తమ నివాసాలకు తిరుగుముఖం పట్టిన ప్రయాణికుల రద్దీతో అటు పబ్లిక్, ఇటు ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఏవీ ఖాళీలేని పరిస్థితి. విమానాలు, బస్సులు, రైళ్లు అన్నీ రద్దీనే...అలాగని సొంత వాహనాలతో బయలుదేరిన వారి పరిస్థితి ఏమైనా మెరుగ్గా ఉందా అంటే వారి పరిస్థితి మరీ దారుణం. ఓన్ వెహికల్స్ పై గమ్యానికి పయనమైన వాహనదారులకు రహదారులపై ట్రాఫిక్ కష్టాలు చుక్కలు చూపించాయి.
సంచలనం:రాజమండ్రి సెంట్రల్ జైలులో దొంగ నోట్లు లభ్యం...అసలు అక్కడ ఏం జరుగుతోంది?
పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్లో...ప్రయాణికుల కష్టాలు
దసరా సెలవుల సందర్భంగా తెలంగాణా ఆర్టీసీ 4,480 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటిలో 50% అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడటం మొదలైంది. రిజర్వేషన్ చేయించుకున్న వారి పరిస్థితి పర్వాలేదుగానీ, రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 50% అదనంగా డబ్బులు చెల్లించినా వేలాడాల్సి రావడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. డొక్కు బస్సుల్లో కుక్కిపంపుతున్నారు. స్పెషల్ అన్నబోర్డు పెట్టి 50% అధిక చార్జీలు వసూలు చేయడం దారుణమని వాపోతున్నారు. మరోవైపు ఎపిఎస్ఆర్టీసీల్లోనూ...రైళ్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
వివిధ కారణాలతో...బారులు తీరిన వాహనాలు
ముఖ్యంగా ఆదివారం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్న పరిస్థితి. చిల్లర లేకపోవడం, టెక్నికల్ కారణాలతో జాప్యం...తదితర కారణాల వల్ల టోల్ ఫీజు చెల్లింపు ఆలస్యమై వాహనాలు కిలోమీటర్ల మేర రాకాసి శ్రేణుల్లా బారులు తీరాయి. దీనికి తోడు ఆదివారం బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వేలాదిగా భవానీ భక్తులు తరలిరావడంతో రద్దీ మరింత పెరగడానికి దారితీసింది.
టోల్ కష్టాలు...తోలు తీశాయి
ఒక్కో టోల్గేట్ దాటడానికి వాహనదారులకు కనీసం 20 నిమిషాలు పట్టడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. అన్ని చోట్ల టోల్ సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్న పరిస్థితి. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు కొన్ని టోల్ గేట్ల వద్ద పాటిస్తున్నారంటూ విఐపిలు సైతం వాపోతున్న దృశ్యాలు కనిపించాయి. అసలు టోల్ వ్యవస్థనే పున:సమీక్షించి మారిన కాలానుగుణంగా సరికొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వాహనదారులు వాదిస్తున్నారు.
ప్రయాణికుల...ట్రాఫిక్ జామ్ కష్టాలు
మరోవైపు తెలంగాణలో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ గ్రామ శివారులో గల జీఎమ్మార్ టోల్ ప్లాజాలోని 11 కౌంటర్లలో ఏడు కౌంటర్లను హైదరాబాద్ వైపునకు వెళ్లే వాహనాలకు కేటాయించారు. వాహనాల వేగ నియంత్రణ కోసం చిట్యాలలో రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా వందలాదిగా నిలిచిపోయాయి. పంతంగి టోల్గేట్ వద్ద 4కి.మీ.ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 16 గేట్లకు 10 గేట్ల ద్వారా వాహనాలను హైదరాబాద్ వైపు మళ్లించారు. ఈ మొత్తం ట్రాఫిక్ జామ్ ప్రభావం అందరు వాహనదారులపై పడింది.