ఎన్డీఏతో తెగదెంపులు: ఇక చంద్రబాబు ఫోన్ ఆ ముగ్గురికేనా?, జాతీయ స్థాయిలో మరోసారి
Recommended Video
న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత ఊహించని విధంగా ఎన్డీఏ నుంచి వైదొలగడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏపీకి కేంద్రం ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చకపోవడం, ప్రత్యేక హోదా గానీ, ప్యాకేజీపైగానీ స్పష్టత ఇవ్వడకపోవడంతో ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ ప్రకటించింది.
అంతేగాక, పార్లమెంటులో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ప్రాంతీయ పార్టీలతోపాటు పలు జాతీయ పార్టీలు టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించాయి. శుక్రవారం లోకసభలో గందరగోళం నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్. దీంతో టీడీపీ, వైసీపీల అవిశ్వాస తీర్మానాలు సోమవారం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
మరోసారి కీలకంగా చంద్రబాబు
ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్లో మరోసారి కీలకంగా మారబోతున్నారు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఒక్కటైన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ)లు బీజేపీని ఓడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఎస్పీ అధినేత ములాయం యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలను సంప్రదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
‘పవన్! పన్నీరుసెల్వంలా?, అప్పుడు చిరుపై మనసుపారేసుకొని! కేసీఆర్కు ప్రశంస - బాబుకు విమర్శా?'
స్వాగతించిన మమత
ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే కేంద్రంలోని బీజేపీకి తగిన గుణపాఠం చెప్పవచ్చని విపక్ష నేతలు భావిస్తున్నారు. కాగా, చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికి రావాలని తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీడీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. అంతేగాక, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అప్రజాస్వామిక విధానాలపై పోరాడేందుకు ఇతర రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఆ ముగ్గురితో కలిసి..
ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు.. మమతా, ములాయం, మాయావతి పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో కొత్త కూటమికి తెరతీసే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలు కూడా చెబుతుండటం గమనార్హం. దీంతో చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్లో మరోసారి ఏం సంచలనానికి కారణమవుతారోననే ఆసక్తి నెలకొంది.
చంద్రబాబు గతంలోనూ..
అయితే, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటికి రావడం ఇదే తొలిసారి కాదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓటమిపాలై 2004లో ఆయన ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. అంతేగాక, బీజేపీని కమ్యూనల్ పార్టీ అంటూ తీవ్ర విమర్శలు కూడా చేశారు.
అప్పుడు మోడీతో కలిసి జగన్కు చెక్
కాగా, 2014 ఎన్నికలకు నెలల ముందేగానే చంద్రబాబు మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరారు. నరేంద్ర మోడీ, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాభవం పెరిగిపోతున్న సమయం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు బీజేపీ వెంట వెళ్లేందుకు మొగ్గుచూపారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల తర్వాత మరోసారి చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది.