"ర్యాగింగ్ చేస్తే ఇక జైలుకే"...పోస్టర్ విడుదల చేసిన కలెక్టర్
విజయనగరం:జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మంగళవారం కలెక్టరేట్ వద్ద "ర్యాగింగ్ చేస్తే ఇక జైలుకే"...పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్ వంటి దుశ్చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్ బుగ్గిపాలవుతుందన్నారు.
దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రుల కన్న కలలు కలలుగానే మిగులుతాయని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ర్యాగింగ్కు దూరంగా ఉండాలన్నారు. కళాశాలలో చేరిన విద్యార్థులు స్నేహభావంతో మెలగాలన్నారు. అలాకాకుండా తోటి విద్యార్థులను ఇబ్బందులు పెడితే చట్టం ఉచ్చులో ఇరుక్కొని జైలుకు పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
విద్యాసంస్థలలో తోటి విద్యార్థులను ఇబ్బందికి గురిచేసే చర్యలు చోటు చేసుకోకుండా యాజమాన్యాలు నిఘా ఉంచాలన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ జోలికి పోకుండా స్నేహభావంతో మెలిగేలా యాజమాన్యం కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సైకాలాజిస్ట్ ఎన్.సూర్యనారాయణ, హిమబిందు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.