పరీక్షలు వద్దు: పవన్ కల్యాణ్, ప్రస్తుత పరిస్థితిలో నిర్వహించలేం, సర్కార్కు సూచన
కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో విద్యార్థుల అన్నీ పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. పదో తరగతి పరీక్షల మాదిరిగానే మిగతా ఎగ్జామ్స్ కూడా పాస్ చేయాలని సూచించింది. వైరస్ వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో.. విద్యార్థులు పరీక్షల పేరుతో ఇతర పట్టణాలు/నగరాలకు వెళ్లడం అంతా శ్రేయస్కరం కాదు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. డిగ్రీ, ఎంబీఏ, అగ్రికల్చర్ బీఎస్సీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులు తమ సొంత గ్రామం/ పట్టణం వదిలి నగరాలకు వెళ్లి పరీక్ష రాసే పరిస్థితి లేదన్నారు పవన్. అక్కడ హాస్టల్లో ఉండి పరీక్ష రాయడం ఆరోగ్యానికి అంతా శ్రేయస్కరం కాదన్నారు. ప్రస్తుత పరిస్థితిలో పరీక్షలు నిర్వహించే సిచుయేషన్ లేదని గుర్తుచేశారు. దీంతోపాటు క్యాంపస్ సెలక్షన్ ఇంటర్వ్యూలో ఎంపికైన వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉందన్నారు. విధుల్లో చేరేందుకు టైమ్ కావొస్తొన్నా.. పరీక్షలు పూర్తి కాక.. సర్టిఫికెట్ లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కొందరు తమ దృష్టికి తీసుకొచ్చారని పవన్ పేర్కొన్నారు. దీనిపై కూడా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Recommended Video
మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలు.. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేశారని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని వర్సిటీలు కూడా ఆ విధంగా ఆలోచన చేస్తే బాగుంటుందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని వర్సిటీలు, ప్రభుత్వాన్ని కోరారు.