శాడిస్ట్ భర్త రాజేష్కు లైంగిక పటుత్వ పరీక్షలు పూర్తి, కీలకం కానున్న నివేదిక
శాడిస్తు భర్త రాజేష్కు ఉస్మానియా మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగంలో లైంగిక పటుత్వ(పొటెన్సీ) పరీక్షలు నిర్వహించారు. వారిచ్చిన నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు.
హైదరాబాద్: శాడిస్తు భర్త రాజేష్కు ఉస్మానియా మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగంలో లైంగిక పటుత్వ(పొటెన్సీ) పరీక్షలు నిర్వహించారు. వారిచ్చిన నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు.
రాజేష్కు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని గంగాధర నెల్లూరు పోలీసులు చిత్తూరులోని మూడవ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం ఉస్మానియా మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగంలో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించింది.
ఈ మేరకు రాజేష్ను రెండు రోజుల క్రితం గంగాధర నెల్లూరు ఎస్ఐ రాజశేఖర్ ఆధర్యంలో ముగ్గురు సిబ్బంది హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడి ఫోరెన్సిక్ విభాగ వైద్య బృందం రాజేష్కు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించింది.
చిత్తూరు జిల్లా చిన్న దామరకుంటకు చెందిన శైజలకు, రాజేష్ అనే వ్యక్తితో వివాహం జరిగిన విషయం తెలిసిందే. శోభనం రోజే శైలజపై రాజేష్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శైలజ ప్రస్తుతం స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రాజేష్ సహా అతని తండ్రి కుమారస్వామిరెడ్డిని అరెస్ట్ చేశారు.
రాజేష్ తన లోపాన్ని కప్పిపుచ్చి పెళ్లి చేసుకుని ఆ తరువాత సాగించిన అరాచకం పోలీసుల విచారణలో తేలిపోయింది. దాంపత్య జీవితానికి పనికిరాడనే విషయాన్ని బయటకు చెబుతుందనే శైలజపై దాడి చేశానని పోలీసుల విచారణలో రాజేష్ ఒప్పుకున్నాడు.
గంగాధర నెల్లూరు మండలంలోని మోతకరంగన్నపల్లెకు చెందిన రాజేష్ వి.కోట మండలంలోని ఆదెనపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకెండరీ గ్రేడ్ టీచరుగా పనిచేస్తున్నాడు. భార్యను హింసించిన రాజేష్ను కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో పాండురంగస్వామి ఇప్పటికే సస్పెండ్ చేశారు.