జగన్ కెరీర్లో మరో కీలక మలుపు- గెలిచినా, ఓడినా విజయమే... విపక్షాలకు సంకటం....
ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుతో పాటు పలు కీలక అంశాల్లో ప్రభుత్వానికి మైలైజ్ తీసుకురావడంతో పాటు విపక్షాలను నోరెత్తలేని స్దితిలోకి నెట్టేసిన సీఎం జగన్.. ఇప్పుడు మరో అంశంలో అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇంగ్లీష్ మీడియం తరహాలోనే ఈ పోరులోనూ గెలిచినా, ఓడినా విజయాన్ని తన ఖాతాలోనే వేసుకునేలా సాగుతున్న జగన్ వ్యూహం... తన కెరీర్లోనూ ఓ గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది.
రైతులకు పండగ: రైతు భరోసా కింద నగదు బదిలీ చేయనున్న జగన్ సర్కార్
అనుభవజ్ఞులకే సాధ్యం కాని రీతిలో...
దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత సొంత పార్టీ వైసీపీని ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ జగన్ ది గాలివాటమే అనే ఊహాగానాలు వినిపించాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వ్యూహాలను చూస్తుంటే రాజకీయాల్లో తలపండిన వారికి సైతం దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. ప్రతీ వ్యూహం వెనుక రాజకీయంగా తన భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా లేదా అనే లెక్కలతోనే ముందుకెళ్తున్నట్లు అర్ధమవుతోంది. జగన్ వ్యూహాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం అనే ఒక్క ఉదాహరణ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అమల్లోకి వస్తే జగన్ విజయం గానూ, రాకపోతే విపక్షాలు అడ్డుపడ్డాయన్న అపప్రదను వారు మూటగట్టుకోవడమే ఖాయంగా కనిపిస్తోంది.
పోతిరెడ్డిపాడుతో రాజకీయంగా మలుపు...
గతేడాది అధికారంలోకి వచ్చాక జగన్ సాధించిన విజయాలన్నీ ఓ ఎత్తయితే పోతిరెడ్డిపాడు విషయంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు మరో ఎత్తుగా చెప్పవచ్చు. వాస్తవానికి పోతిరెడ్డిపాడు కాల్వల సామర్ధ్యం రెట్టింపు చేయడం ద్వారా జగన్ .. ఇన్నాళ్లూ తనకు స్నేహహస్తం చాచిన తెలంగాణ సీఎం కేసీఆర్ నే ఆత్మరక్షణంలో నెట్టేశాడంటే అతిశయోక్తి కాదు. గతంలో ఇదే పోతిరెడ్డిపాడుపై టీఆర్ఎస్ ప్రదర్శించిన దూకుడుతో ఇప్పటి కేసీఆర్ మౌనాన్ని పోల్చిచూస్తే అర్దమయ్యేది ఇదే. పోతిరెడ్డిపాడుపై దూకుడుగా ముందుకెళ్లడం ద్వారా తనకు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టిన రాయలసీమలో జగన్ రాజకీయంగా తిరుగులేని భవిష్యత్తును సొంతం చేసుకునేందుకు రాచబాట పరుచుకున్నట్లు అర్ధమవుతోంది.
విపక్షాలన్నీ గప్ చుప్... ఏదోరకంగా మద్దతివ్వక తప్పని పరిస్ధితి...
గతంలో రాయలసీమలో ఓ ప్రాజెక్టు కడితే చాలు దాని మైలేజ్ కోసం రాజకీయ నేతలు తపించేవారు. కానీ ఈసారి జగన్ పోతిరెడ్డిపాడుపై తీసుకున్న నిర్ణయంతో విపక్షాలు మైలేజ్ గేమ్ ఆడేందుకు ఏమాత్రం వీలులేకుండా పోయింది. ముఖ్యంగా ప్రధాన విపక్షం టీడీపీ పోతిరెడ్డిపాడుపై ఏం మాట్లాడాలో తెలియక కేసీఆర్-జగన్ నాటకాలు అడుతున్నారని డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తోంది. మరో విపక్షం బీజేపీ అయితే బహిరంగంగానే జగన్ కు మద్దతిస్తోంది. ఇన్నాళ్లూ తాము కూడా సీమ ప్రయోజనాల కోసం పోరాడామని చెప్పుకుంటోంది. బీజేపీ మిత్రపక్షం జనసేన అయితే ఎలా స్పందించాలో తెలియక మౌనాన్నే ఆశ్రయిస్తోంది. ఏపీ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ చూడని మార్పు ఇది. ఓ కీలక అంశంపై విపక్షాలను ఇంత గందరగోళంలోకి నెట్టడం ద్వారా జగన్ ఫలితంతో సంబంధం లేకుండానే సక్సెస్ అయ్యారనే వాదన వినిపిస్తోంది.
Recommended Video
గెలిచినా ఓడినా విజయమే....
ఓ ఆట ఆడుతున్నప్పుడు ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్న మాటలే వినిపిస్తుంటాయి. రాజకీయాల్లో సైతం నేతలు గెలుపోటములను చాలా సీరియస్ గా తీసుకుంటుంటారు. కానీ చాలా అరుదైన సందర్బాల్లో మాత్రమే ఓడినా గెలిచినట్లే అనే మాట వినిపిస్తుంటుంది. ఈసారి పోతిరెడ్డిపాడుపై జగన్ నిర్ణయం తర్వాత ఇప్పుడు అదే వాదన వినిపిస్తోంది. పోతిరెడ్డిపాడు విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ.. ఫలితంతో సంబంధం లేకుండానే జగన్ ధీమాగా కనిపిస్తున్నారు. దీనికి కారణం ఈ విషయంలో గెలిస్తే రాయలసీమకు తాగు, సాగునీరు అందించిన జలప్రదాతగా జగన్ నిలిచిపోతారు. విఫలమైనా సీమ ప్రయోజనాల కోసం మిత్రుడు కేసీఆర్ తో సైతం పోరాడిన ధీశాలిగా నిలుస్తారు. అందుకే ఇది జగన్ కెరీర్ కు ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పక తప్పని పరిస్ధితి.