ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీలు, 500 యూనిట్లు దాటితే 90 పైసల మోత, రాష్ట్రానికి రూ.1300 కోట్లు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయి. 500 యూనిట్లు దాటినా వారికి కరెంట్ చార్జీలను పెంచుతున్నట్టు ఈఆర్సీ ప్రకటించింది. రాష్ట్రంలో డిస్కంలు నష్టాల్లో కొనసాగుతోన్నాయి. విద్యుత్ చార్జీలు పెంచి నష్టాలను పుడ్చలేని ఒత్తిడి వస్తోన్న నేపథ్యంలో 500 యూనిట్లు వినియోగం దాటినా వారికి చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
500 లోపు నో..
విద్యుత్ చార్జీల పెంపుతో సామాన్యులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు. 500 యూనిట్లు దాటినా వారి నుంచి మాత్రం చార్జీ వసూల్ చేస్తారు. 500, ఆపై యూనిట్కు 90 పైసల చొప్పున ముక్కు పిండీ మరీ తీసుకుంటారు. 500 యూనిట్ల తర్వాత యూనిట్కు ఉన్న 9.05 రూపాయలను రూ.9.95కు పెంచారు. యూనిట్కు 90 పైసలు పెంచి.. ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలకు షాక్ ఇచ్చారు.
వీరికే నష్టం..
విద్యుత్ చార్జీల పెంపుతో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, పరిశ్రమలు, కార్యాలయాల బిల్లు మోత మోగనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి 1300 కోట్ల ఆదాయం సమకూరనుంది. దీంతో డిస్కంల నష్టాలను కొంతమేర అయినా భర్తీ చేయొచ్చని ఈఆర్సీ భావిస్తోంది. నష్టాల బాటలో ఉన్న డిస్కంలను బయటపడేసేందుకు చార్జీల పెంపు తప్ప మరో మార్గం లేదని ఈఆర్సీ స్పష్టంచేసింది.
పవర్ ఇవ్వం..
సబ్సిడీదారులకు సంబంధించి బిల్లు వెనక సబ్సిడీ వివరాలు పొందుపరుస్తామని ఏపీ ఈఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి తెలిపారు. దీంతోపాటు రైల్వే ట్రాక్షన్ టారిఫ్ పెంచడం వల్ల రూ. 200 కోట్ల బారం పడుతోందని వివరించారు. ఏపీలో 9,500 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉందని నాగార్జున రెడ్డి అన్నారు. విద్యుత్ ఇవ్వాలని ప్రైవేట్ సంస్థలు కోరినా నిరాకరించామని చెప్పారు.