కేటీఆర్ ఎందర్ని కొట్టిస్తారో: కిరణ్ రెడ్డి పైన షబ్బీర్, బాబుపై మైసూరా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా రెడ్డి విద్యుత్ ఛార్జీల పెంపు పైన వేర్వేరుగా ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పదేళ్ల తమ కాంగ్రెస్ పాలనలో ఒక్కసారే ఛార్జీలు పెంచామని చెప్పారు.
అందరు విభజన గొడవలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చేపడితే రోడ్ల మీదకు వస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలకు అది ట్రయల్ మాత్రమే అంటున్న మంత్రి కేటీ రామారావు ఎంత పెద్ద సినిమా చూపిస్తారో, ఎందరిని కొట్టిస్తారో చూద్దామని దుయ్యబట్టారు.
చంద్రబాబు ప్రభుత్వంపై మైసూరా రెడ్డి
ఏపీ విద్యుత్ ఛార్జీల పెంపు వెనుక పెద్ద అవినీతి జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసురా రెడ్డి ఆరోపించారు. అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్ల పైన పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బొగ్గు దిగుమతుల్లో కూడా భారీ అవకతవకలు జరిగాయన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపు భారం ప్రజల పైన పెట్టడం దుర్మార్గమన్నారు. ఏపీ సర్కారు బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ లోటు కేవలం అంకెల గారడి తప్ప నిజమైన భారం కాదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. అవినీతి, దుబారా, స్వలాభం కోసమే విద్యుత్ కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు.