బాబును వదల బొమ్మాళీ అంటున్న విజయసాయి! అధికారమంటే దోచుకోవడం.. దాచుకోవటం కాదంటూ ట్వీట్లు
విజయసాయి రెడ్డి చంద్రబాబు అంటేనే అగ్గి మీద గుగ్గిలం అయ్యే నేత .. వైసీపీ ఎంపీగా , జగన్ కు సన్నిహితుడిగా పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ఎన్నికల సమయంలో ఏకిపారేశారు. ఏపీలో అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబును మాత్రం వదల బొమ్మాలీ వదల అంటున్నాడు. అందులో భాగంగా తాజాగా చంద్రబాబుపై మరోమారు ట్వీట్లతో దాడి చేశారు.
జన్మభూమి కమిటీల మాఫియాకు కాలం చెల్లింది అన్న విజయసాయి
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తాజాగా సోమవారం ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్లలో చంద్రబాబు పాలనను తిట్టిపోశారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని చూపించారు. ఇక వైసీపీ పాలనలో జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యానికి కాలం చెల్లిందని ఆయన పేర్కొన్నారు . గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలన్నీ ప్రజల గడప వద్దకు వెళ్తాయి అని చెప్పారు . చంద్రబాబు హయాంలో నేతలు వందల,వేల కోట్లు పోగేసుకున్నారు. పేదల జీవితాలు అస్థవ్యస్తమయ్యాయి. మా సిఎం వచ్చాడు. కళ్లలో పెట్టుకుని కాపడతాడనే భరోసా కనిపిస్తోందిప్పుడు అంటూ జగన్ పాలనకు కితాబిచ్చి చంద్రబాబు పాలన దోపిడీ పాలన అని మండిపడ్డారు.
చంద్రబాబు సీబీఐ ని బ్యాన్ చేస్తే జగన్ సీబీఐ కి రెడ్ కార్పెట్ పరచాడన్న వైసీపీ నేత విజయసాయి
అంతే కాదు తాజాగా సీబీఐ ని ఏపీలో అనుమతిస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో చంద్రబాబు సీబీఐ ని రాష్ట్రంలో బ్యాన్ చేశారు. ఇక నేపధ్యంలో ఇక సీబీఐని రాష్ట్రంలో చంద్రబాబు బ్యాన్ చేయగా.. జగన్ దానిని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని దీనిని ఉద్దేశిస్తూ కూడా విజయసాయి కామెంట్ చేశారు. తానేం చేసినా అడ్డుకోరాదని చంద్రబాబు ఒక ఉద్యమమే చేశారు.సీబీఐని బ్యాన్ చేశారు. ఐటీ దాడులను అడ్డుకున్నారు. ఈడీ ఎలా వస్తుందని గుడ్లురిమారు. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ జగన్ గారు ఆదేశాలు జారీ చేశారు. దొంగలను రక్షించేది లేదని తేల్చిచెప్పారు. చూస్తున్నారా చంద్రబాబూ? అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. చంద్రబాబు సీబీఐ ని బ్యాన్ చేస్తే జగన్ సీబీఐ కి రెడ్ కార్పెట్ పరచాడని ఆయన పేర్కొన్నారు.
అధికారం అంటే దోచుకోటానికి దాచుకోటానికి కాదన్న విజయసాయి
ఇక టీడీపీ పాలనలో అవినీతి రాజ్యమేలిందని టీడీపీ నాయకులు దోచుకున్నారని చెప్పిన విజయసాయి అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చ పార్టీ వాళ్లు అనుకున్నారు. అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారన్నారు . కానీ మనం మాత్రం దీన్నొక పవిత్ర బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు .ప్రజలిచ్చిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకు మాత్రమే అని అర్థం చేసుకోవాలని చెప్పారు . జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలంటూ విజయసాయి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.