రివర్స్, ఏపీకి కష్టం: కేసీఆర్ సాయం కోరుతున్న చంద్రబాబు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి! నిన్నటి వరకు విద్యుత్ కోతలతో తెలంగాణ రాష్ట్రం సతమతమైంది. విద్యుత్ ఇక్కట్లు తీర్చే దారి లేక కేసీఆర్ సర్కారు ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే, తమకు సర్ ప్లస్ విద్యుత్ వస్తే తాము తెలంగాణకు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అయితే, ఇప్పుడు ఏపీకి విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి. నాగార్జున సాగర్లో జలాలు అడుగంటాయి. దీంతో పవర్ హౌస్కు నీళ్లు అందక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సాగర్ కుడికాలువ ద్వారా విద్యుదుత్పత్తికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ అధికారులు చర్చిస్తున్నారు.
విద్యుదుత్పత్తి కోసం పదివేల క్యూసెక్కుల నీరు అవసరం. అయితే, ఆరువేల క్యూసెక్కుల నీటి విడుదల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చర్చిస్తోంది.
ఏపీలో 24 గంటలు విద్యుత్ సరఫరా అవుతోంది. సదరన్ గ్రిడ్ ఏర్పాటుతో ఇది సాధ్యమవుతోంది. అయితే, ఇప్పుడు సాగర్లో నీరు అడుగండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సాగర్ పవర్ హౌస్ వద్ద ఉత్పత్తి నిలిచిపోతే ఏపీలోను విద్యుత్ సరఫరాలో ఇబ్బందులే.