డిగ్గీ పోస్ట్మెన్, అందుకే అధికారం కోల్పోయా: చంద్రబాబు
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ స్క్రిప్ట్ను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు పంపే పోస్టుమాన్ ఎపి కాంగ్రెసు వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల బాగు కోసం విద్యుత్ సంస్కరణలు తెచ్చి అధికారం కోల్పోయానన్నారు. టిడిపి హయాంలో అధికారులకు గుర్తింపు వచ్చిందని, కాంగ్రెసు, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, జైళ్లకు వెళ్తున్నారన్నారు.
కాంగ్రెసు పార్టీ కుట్రను జాతీయస్థాయిలో బయటపెట్టేందుకు తాను ఢిల్లీలో దీక్ష చేశానని, ఈ సమస్యను జాతీయ సమస్యగా తాము చెప్పగలిగామన్నారు. తన దీక్షకు సహకరించిన వారికి కృతజ్ఞతలు అన్నారు. దీక్ష ద్వారా తాము విజయం సాధించామని భావిస్తున్నామన్నారు. కాంగ్రెసు పార్టీ నేతలు 10 జనపథ్కు కట్టుబానిసలుగా మారారని విమర్శించారు. సోనియా స్క్రిప్ట్ ప్రకారమే జగన్, కెసిఆర్లు డ్రామాలాడుతున్నారన్నారు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతకం చేసిన ఫైళ్లు అదృశ్యమయ్యాయని, అందులో ఆయన పాత్ర లేదా అని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణం కేసు సుప్రీం కోర్టులో ఉన్నప్పుడే ఫైళ్లు అదృశ్యమయ్యాయన్నారు. ఢిల్లీ మొత్తం బ్రోకర్ల రాజ్యంగా మారిందని ఆరోపించారు. యూపిఏ ప్రభుత్వం ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకు ఇది నిదర్శనమన్నారు. యూపిఏ ప్రభుత్వం వచ్చాక పదిహేను లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విమర్శించారు.
చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రూపాయి విలువ ఇరవై రెండు శాతం పడిపోయిందన్నారు. నిత్యావసర ధరలు ఐదువందల శాతం పెరిగాయన్నారు. దొంగనోట్ల చలామణిని రూపుమాపేందుకు ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లను నిషేధించాలని తాను ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కాంగ్రెసు పార్టీ ఈ దేశానికి ఇచ్చిన కానుక బానిసత్వం అన్నారు. దేశంలో కోట్లాది మంది బానిసలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్న బానిసల్లో సగం మంది భారత్లోనే ఉన్నారని నివేదికలో తేలిందన్నారు.
యూపిఏ ప్రభుత్వం అవినీతిపరులను కాపాడుతోందన్నారు. యూపిఏ అధికారంలోకి వచ్చాక దేశం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. బొగ్గు కుంభకోణం లక్షా ఎనభై వేల కోట్లు, 2జి లక్షా డెబ్బై వేల కోట్లు, జగన్ది లక్ష కోట్లు.. ఇలా ఎంతో అవినీతి జరిగిందన్నారు. బొగ్గు కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతుందన్నారు. 35 మంది మంత్రులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించలేదని విమర్శించారు.
నల్లధనం వెనక్కి తీసుకు రావడంపై ప్రధాని, ఆర్థిక మంత్రి చిదంబరం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. దేశంలో పాలన లేదని, అవినీతి, ధరలు పెరిగాయన్నారు. కాంగ్రెసు అసమర్థత, అవినీతి ప్రజలకు భారంగా మారిందన్నారు. ఆర్థిక సంస్కరణలకు ముందు ఉన్న రేటు ఇప్పుడు ఉందన్నారు. రాష్ట్రం, దేశ పరిస్థితులపై ఏం చేయాలో ఆలోచిస్తున్నామన్నారు.