ఇక ప్రజల మద్యలో పవర్ స్టార్..! 29 నుంచి జనసేన సమావేశాలు..!!
అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ లో జనసేన దూకుడు పెంచబోతోంది. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రికి కొన్ని రోజులు గడువు ఇచ్చిన తర్వాత స్పందిస్తామన్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అదే దారిలో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెంటు నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్బంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకు అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు.
ముందుగా పార్టీలోని పదవులను భర్తీ చేసి, ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని జనసేనాని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో బాగంగా పార్టీ అదికార ప్రతినిధులను నియమించిన గబ్బర్ సింగ్ ప్రజా కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా ఏపి రాజకీయాల్లో ప్రభుత్వ విధానాలు ఏవిధంగా ఉన్నాయి..? ప్రతిపక్ష పార్టీ తమ పాత్రను పూర్తి స్థాయిలో నిర్వహిస్తుందా..?లేదా..? అనే అంశాలపై జనసేన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ నెల 29వ తేదీ నుంచి పార్టీ కమిటీలు, నాయకులు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.
మంగళగిరి, విజయవాడలోని పార్టీ కార్యాలయాల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పేర్కొన్నారు. పార్టీ నిర్మాణంలో భాగంగా క్రియాశీలక కార్యకర్తలు, ముఖ్య నేతలతో చర్చిస్తారని అన్నారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టే కార్యక్రమాల నిర్వహణ గురించి ముఖాముఖీ చర్చలు ఉంటాయని తెలిపారు. 30వ తేదీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, 31వ తేదీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశాలను మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తామని వివరించారు.