ఏపీలో పెరిగిన ఉక్కపోత- రికార్డు స్ధాయికి కరెంటు వాడకం- విభజన తర్వాత ఇదే టాప్
ఏపీలో వేసవి ప్రభావం మొదలైపోయింది. ఎక్కడ చూసినా జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీంతో కరెంటు వాడకం కూడా భారీగా పెరిగింది. ఏపీలో రాష్ట్ర విభజన గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ వాడకం గరిష్ట స్ధాయికి చేరింది. దీంతో అధికారులు కూడా సర్దుబాట్లు చేయలేక బెంబేలెత్తుతున్న పరిస్ధితి కనిపిస్తోంది.
ఏపీలో గత వారం రోజులుగా ఉక్కపోత బాగా పెరిగింది. దీంతో విద్యుత్ వాడకం కూడా ఆ మేరకు పెరిగిపోయింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రోజు వారీ సగటు 40 మిలియన్ యూనిట్ల వరకూ పెరిగింది. దీంతో గరిష్ట రోజువారీ వినియోగం ఇప్పుడు 208 మిలియన్ యూనిట్లకు చేరింది. ఫిబ్రవరిలోనే 208 మిలియన్ యూనిట్ల గరిష్ట రోజువారీ వాడకం నమోదు చేసుకున్న రాష్ట్రానికి ఇప్పుడు సగటున రోజుకు అంతే వాడకం జరుగుతోంది.
ఇంకా వేసవి పూర్తిగా మొదలుకాకముందే 208 మిలియన్ యూనిట్ల గరిష్ట విద్యుత్ వాడకం నమోదవుతున్న నేపథ్యంలో మార్చి నెలలో ఈ రికార్డు మరింత భారీ స్ధాయికి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. మార్చిలో గరిష్ట వాడకం 220 మిలియన్ యూనిట్లకు చేరుకోవచ్చని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటే సర్దుబాట్లూ తప్పవని చెప్తున్నారు. కాబట్టి పారిశ్రామిక, గృహ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ సర్దుబాట్లు చేయక తప్పని పరిస్ధితి నెలకొంది.