పవన్ కళ్యాణ్ మిగిల్చిన డౌట్స్, ఎవరూ నమ్మని నిజాలు: జగన్కు బాసట!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా ఇంకా డౌట్స్ మిగుల్చుతూనే ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించాక పోటీ పైన సస్పెన్స్, ఆ తర్వాత ప్రశ్నిస్తానని చెప్పి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడని విపక్షాలు విమర్శించిన సందర్భాలున్నాయి.
తాజాగా, సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల నేపథ్యంలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రత్యేక హోదా గుర్తుందని చెప్పిన పవన్ కళ్యాణ్.. దాని పైన కార్యాచరణ మాత్రం చెప్పలేదు. ఇంటర్వ్యూలో కార్యాచరణ చెప్పకపోయినప్పటికీ... దాని గురించి ఓసారి ట్విట్టర్లో తప్ప స్పందించిన సందర్భాలు లేవంటున్నారు.
ప్రత్యేక హోదా గురించి అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా, ప్రజల దాని కోసం ఎదురు చూస్తుండగా దాని గురించి ఇప్పటి దాకా మాట్లాడక పోవడం ఏమిటనే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా బాధ్యతను నెత్తిన పెట్టుకోవాలని చాలామంది భావిస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి కూటమికి మద్దతిచ్చినందున.. పవన్ కళ్యాణ్ దానిని భుజాలకెత్తుకుంటే అది మేలు చేస్తుందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. రెండేళ్లవుతున్నా హోదా ఇవ్వకపోవడాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించక పోవడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా ఆయన గళమెత్తాలని చెబుతున్నారు.
అయితే, ఆయన ప్రత్యేక హోదా విషయంలో ఇంకా బిజెపి పైన నమ్మకంతో ఉన్నందువల్లే మౌనంగా ఉంటారనే వారు లేకపోలేదు. ప్రత్యేక హోదాకు చిక్కులను తొలగించే ప్రయత్నంలో బిజెపి ఉంది. దానిని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నందువల్లే మాట్లాడటం లేదని అంటున్నారు.
ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిని ఇంటర్వ్యూ సమయంలో ఆయన అంగీకరించారు కూడా. తాను ప్రశ్నించడం లేదని ఎవరైనా నిలదీసి అడగవచ్చునని, అయితే నేను ప్రస్తుతం ఒక్కడినే ఉన్నానని, తనకంటూ ఓ మిషన్ ఏర్పాటు అయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పారు.
సినిమాల్లో ఒక్కడినే సులభంగా డైలాగ్ చెప్పగలనని, సినిమాల్లో రెండున్నర గంటల్లో సమస్యలన్నీ తీర్చేయగలనని, కానీ రాజకీయాల్లో లేదా నిజ జీవితంలో అది సాధ్యం కాదని చెప్పారు. నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటానని చెప్పారు.
అయితే, తాను ప్రశ్నించడానికి ఓ మిషన్ ఏర్పాటయ్యేందుకు సమయం పడుతుందన్న పవన్ కళ్యాణ్కు ఆ విషయం సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి - టిడిపి కూటమికి మద్దతిచ్చినప్పుడు తెలియదా అని అడుగుతున్నారు. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో రైతుల భూమి విషయంలో పవన్ ప్రశ్నించి సఫలమయ్యారని గుర్తు చేస్తున్నారు.
ఇక, తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పవన్ చెప్పడం గమనార్హం. డబ్బుల కోసం మరో రెండు సినిమాలు చేస్తానని కూడా చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన పోటీ విషయంలోను ఆయన స్పష్టత ఇచ్చీ, ఇవ్వనట్లుగా కనిపించింది.
వచ్చేసారి పోటీ చేస్తానని, అయితే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తానో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని అన్నారు. తద్వారా జనసేన 2019 ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పోటీ చేస్తుందా అనేది ఉంకా సస్పెన్స్గానే మిగిలిందని చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాలు అనడం, ప్రశ్నిస్తానని చెప్పడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తానని చెప్పి రెండేళ్లవుతుందని, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఇంకా ప్రశ్నించడం లేదని అంటున్నారు. దాంతో పాటు పూర్తిస్థాయి రాజకీయాలపై స్పష్టత లేనప్పుడు పార్టీ పెట్టి ఓ కూటమికి మద్దతివ్వడం ఏమిటని కూడా అంటున్నారు.
నమ్మలేని నిజాలు కొన్ని ఆయన చెప్పారు. తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పడం షాకింగ్ అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఎవరూ నమ్మకపోవచ్చునని కూడా వ్యాఖ్యానించారు. అదే సమయంలో తాను బ్రహ్మచారిగా ఉంటానని భావించారని, కానీ మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని చెప్పారు.
ఇక, పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలో విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఉపయోగిస్తుంది. దీనిపై పవన్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయాన్ని పక్కన పెడితే... ఏపీలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వైసిపి అధినేత జగన్కు నైతిక స్థైర్యాన్ని ఇచ్చేవేనని చెబుతున్నారు.