పోలవరం రివర్స్ టెండరింగ్ పై కేంద్రానికి పీపీఏ నివేదిక ..ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో నష్టం అంటూ రిపోర్ట్
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సిఈఓ ఆర్కే జైన్ ను సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది. ఆగస్టు 17 వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనుల రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సర్కార్ తీరుతో అటు కేంద్రం సైతం ఆగ్రహంతో ఉంది. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈవో చెప్పినప్పటికీ ఆయన చెప్పిన అంశాలను లెక్క చెయ్యకుండా జగన్ సర్కార్ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో తీసుకున్న నిర్ణయంపై కేంద్రప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది.కేంద్ర జలశక్తి వనరుల శాఖ, పీపీఏను వెంటనే పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండర్ల విషయం పై పూర్తి నివేదికను కోరింది. దీంతో నిన్న పీపీఏ తన నివేదికను కేంద్రానికి సమర్పించింది.
ఇది రద్దుల ప్రభుత్వం .. ఓ మతానికి అనుకూలం .. పంధా మార్చుకోకుంటే ప్రతిఘటన తప్పదన్న బీజేపీ నేత
కేంద్రానికి 12 పేజీల నివేదిక .. ఏపీ సర్కార్ నిర్ణయాల ప్రభావం వివరించిన పీపీఏ
పోలవరంప్రాజెక్ట్ స్థితిగతులపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) 12 పేజీల నివేదిక రూపొందించింది. ఇక ఈ నివేదికలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అమలు చేస్తే ఎలాంటి నష్టాలు ఉంటాయో సమగ్రంగా పేర్కొన్నారు. ఇక ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో నాలుగేళ్ల పాటు జాప్యం జరిగిందని, ఇప్పుడు మళ్ళీ రివర్స్ టెండరింగ్ కు వెళితే పనుల్లో ఇంకా జాప్యం జరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు పీపీఏ తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ముఖ్యంగా, ఏపీ ప్రభుత్వం తీరుతో న్యాయపరమైన సమస్యలు తప్పవని పీపీఏ స్పష్టం చేసింది.రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని ఇక దీని ప్రభావంతో పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజక్టులు మరింత భారం కానున్నాయని, పోలవరం ద్వారా జరగాల్సిన ప్రయోజనాల విషయంలోనూ మరింత ఆలస్యం తప్పదని వివరించింది పీపీఏ.
పీపీఏ సమావేశంలో చెప్పినా.. లేఖ రాసినా బేఖాతరు చేసిన జగన్ సర్కార్
ఒకపక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశముందని ఇటీవల జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సీఈవో ఆర్ కె జైన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు నిర్వహిస్తున్న నవయుగ కంపెనీ పనితీరు కూడా బాగానే ఉన్నట్టు ఆయన మీటింగ్ లో పేర్కొన్నారు. ఇక సమావేశం తర్వాత కూడా ఆయన పోలవరం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చెయ్యాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సమయంలో వద్దని వారిస్తూ పీపీఏ సిఈఓ జైన్ ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారి ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల మేరకు రీ టెండరింగ్ విధానాన్ని మానుకోవాలని సలహా ఇస్తున్నట్టుగా ఆ లేఖలో పీపీఏ సీఈఓ పేర్కొన్నారు .
ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో న్యాయపరమైన ఇబ్బందులు తప్పవన్న పీపీఏ
రివర్స్ టెండరింగ్ కు వెళ్లకూడదని సూచించినా కూడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కేంద్రం చాలా సీరియస్ అయ్యి సమగ్ర నివేదిక కోరింది .తమ సూచనను పట్టించుకోకుంండా 24 గంటల్లోపుగానే రివర్స్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ ఆర్ కె జైన్ ను కోరింది. దీంతో పీపీఏ 12 పేజీల సమగ్ర నివేదికను అందించింది. అయితే ఈ నివేదిక జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంది. న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేసింది. మరి కేంద్రం ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో.. ఏపీ సీఎం జగన్ ఈ వ్యవహారంలో ఏం చెయ్యనున్నారో అన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది. .