అనుకున్న సమయానికే పోలవరం-ఎత్తు తగ్గింపు సాధ్యం కాదు- పీపీఏ కీలక వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఏపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. పోలవరం ఎత్తు తగ్గించడం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ విపక్షాలు నిత్యం విమర్శలకు దిగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం సెంటీమీటర్ కూడా ఎత్తు తగ్గించే ప్రశ్నేలేదని తాజాగా క్లారిటీ ఇచ్చింది. అయినా దీనిపై రచ్చ మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రాజెక్టు అధారిటీ సభ్యులు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం వ్యవహారంపై స్పష్టత ఇచ్చాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించేందుకు ప్రాజెక్టు అథారిటీ సభ్యులు ఇవాళ అక్కడికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు సాగే పర్యటనలో భాగంగా వారు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను ఏపీకి చెందిన నీటిపారుదలశాఖ అధికారులతో చర్చిస్తారు. తొలి రోజు పర్యటనలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించిన ప్రాజెక్టు అథారిటీ సభ్యులు దీనిపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తొలి డీపీఆర్ ఆధారంగానే జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. గతంలో ఆమోదించిన డీపీఆర్ ప్రకారం అనుకున్న సమయానికే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై వస్తున్న ఊహాగానాలపైనా ప్రాజెక్టు అథారిటీ సీఈ ఏకే ప్రధాన్ స్పందించారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం తగ్గింపు ఎవరి వల్లా కాదన్నారు. ఇది సాధ్యం కూడా కాదన్నారు. ఇప్పటివరకూ 76 శాతం కాంక్రీట్, హెడ్వర్క్స్ పనులు పూర్తయ్యాయని ప్రధాన్ తెలిపారు. పునరావాసం, ఇతర పనులు అన్నీ కలిపి 41 శాతం వరకూ పూర్తయిందన్నారు.
Recommended Video
ఈ లెక్కన చూస్తే పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికే పూర్తవుతుందన్న విశ్వాసం ఉందన్నారు. ప్రాజెక్టును ఇవాళ సందర్శించిన వారిలో సీఈ ప్రధాన్తో పాటు పీపీఏ సభ్యులు మోహన్(డిఈ),అమిత్ సింగ్(సిఈ-పవర్ సెక్టార్)లు, ఇరిగేషన్ అధికారులు, పోలవరం ఎస్ఈ ఎం.నాగిరెడ్డి, డీఈలు బాలకృష్ణ, రామేశ్వర్ నాయుడు, ఈఈ ఆదిరెడ్డి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ జీఎం సతీష్ బాబు అంగర, మిశ్రా ఉన్నారు.