కేఏ పాల్ కామెడీ! ఏడాదిలో ఏపీ అసెంబ్లీని రద్దు చేయించేస్తా! మాయావతి మాయలో పవన్ కల్యాణ్
అమరావతి: ప్రముఖ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యానాలు చేశారు. త్వరలో రాష్ట్ర శాసనసభకు జరగబోయే ఎన్నికల కాల గడువు ఏడాది మాత్రమేనని అన్నారు. సరిగ్గా ఏడాది ముగిసిన తరువాత.. తాను దగ్గరుండి అసెంబ్లీని రద్దు చేయించేస్తానని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వాతావరణాన్ని కల్పిస్తానని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పైనా విమర్శలు చేశారు. ఆయన బహుజన్ సమాజ్ వాది చీఫ్ మాయావతి మాయలో పడ్డారని ఎద్దేవా చేశారు.
నోటాకే నా ఓటు..
వచ్చే ఎన్నికల్లో తాను నోటాకే ఓటు వేస్తానని పాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరిలోనూ నిజాయితీ కనిపించట్లేదని అన్నారు. నిజాయితీ లేని వారిని అసెంబ్లీకి పంపించడం వల్ల ఉపయోగం లేదని చెప్పారు. తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా సరే.. తాను మాత్రం తమ అభ్యర్థికి ఓటు వేయనని, నోటాకే వేస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ.. ఇవన్నీ అవినీతిలో కూరుకునిపోయి ఉన్నాయని చెప్పారు. అవినీతి పరులను చట్టసభలకు పంపించకూడదని అన్నారు. త్వరలో జరగోయే ఎన్నికలు చట్టబద్ధంగా లేవని, అందుకే తాను ఏడాది తిరిగే సరికల్లా అసెంబ్లీని రద్దు చేయిస్తానని చెప్పారు.
మాయావతి నుంచి ముడుపులు..
వందల కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడిన బీఎస్పీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుని తప్పు చేశారని చెప్పారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్.. మాయావతి మాయలో పడ్డారని, ఇతరులు ఏది చెప్పినా వినే ఓపిక గానీ తీరిక గానీ ఆయనకు లేదని అన్నారు. మాయావతి మాయలో పడటం వల్లే.. ఆమె కాళ్ల మీద పడుతున్నారని చెప్పారు. మాయావతి నుంచి పవన్ కల్యాణ్ కు భారీగా డబ్బు మూటలు అంది ఉండొచ్చని, అందుకే అసవరం వచ్చినప్పుడల్లా ఆమె కాళ్లను మొక్కుతున్నారని పాల్ విమర్శించారు.
రాష్ట్రంలో బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీ
ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని కేఏ పాల్ అన్నారు. లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుస్తారని అన్నారు. తాను మాత్రం ఆ పార్టీ గెలవకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలను వాయిదా వేయించ దగ్గ సత్తా తనకు ఉందని అన్నారు. ఎన్నికలను వాయిదా వేయించడానికి వైఎస్ఆర్ సీపీ నాయకులు తనతో చేతులు కలిపి, కలిసి రావాలని సూచించారు. తమ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ.. తనకు కనీసం వారి పేర్లు కూడా తెలియట్లేదని పాల్ చెప్పారు. ఎవరెవరు? ఎక్కడెక్కడ? ఏఏ స్థానాల్లో పోటీ చేస్తున్నారనే విషయంపై తనకు స్పష్టత లేదని అన్నారు.